( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
నవంబర్ మాసం సమీపిస్తోందంటే చాలు పెన్షనర్లలో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం నవంబరు నెలలోనే జీవన ప్రమాణ పత్రం సమర్పించాలి. విద్యావంతులు కాస్త ముందుగానే అప్రమత్తం అవుతున్నా అనేక మంది ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. పింఛన్దారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్ సర్టిఫికెట్) సమర్పణ గడువును నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా కారణంగా జీవన ప్రమాణ పత్రం సమర్పించ లేకపోయిన లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ఫిబ్రవరి వరకు పింఛను మంజూరు చేయనున్నారు. కరోనా మహమ్మారి వల్ల సీనియర్ సిటిజన్స్ ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే ఈపీఎఫ్వో పింఛన్దారుల జీవన ప్రమాణ పత్రం సమర్పణ తేదీని నవంబర్ నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు జీవన ప్రమాణ పత్రాన్ని నవంబర్ 30లోపు ఎప్పుడైనా సమర్పించొచ్చు. దరఖాస్తు చేసిన తేదీ నుంచి ఏడాది వరకు ఇది వర్తిస్తుంది. తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడగించారు. సాధారణ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, పింఛన్లు ఇచ్చే బ్యాంకు శాఖల్లో జీవన ప్రమాణ పత్రాలను సమర్పించొచ్చు.
జీవన ప్రమాణ పత్రం సమర్పణ గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల పెన్షనర్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.