మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా మా అసోసియేషన్ కు సొంత భవనం ప్రధాన అజెండాగా మారింది. తన హయాంలో భవనం నిర్మిస్తామని అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే పదవికి ప్రకాష్ రాజ్ పై తలపడుతున్న మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మరింత ముందుకు వెళ్లారు. మా అసోసియేషన్ భవనాన్ని తన సొంత ఖర్చుతో నిర్మిస్తానని ప్రకటించారు. విష్ణు ఏమన్నారో ఆయన చూద్దాం..
‘పూర్వం మద్రాసులో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం నటులకి కలిపి ఒక్క నడిగర్ సంఘం మాత్రమే ఉండేది. మన తెలుగు సినీ నటీనటులకి ప్రత్యేకంగా అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటైంది. తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా మంచి పనులు చేస్తూ ఈ అసోసియేషన్ ని అద్భుతంగా నడిపారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్ రావడం, 1993లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ని అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నాన్నగారు, చిరంజీవి గారు మరికొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేశారు.
నాన్నగారు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటున్నారు.1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సినీ కార్మికులకి నివాసం కల్పిద్దామని స్థలాన్ని కేటాయించింది. 1997లో దాన్ని పెద్ద రాజకీయ నాయకుడు తన ఫ్యాక్టరీ కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే నాన్న గారికి ఆ విషయం తెలిసి సినీ కార్మికుల తరపున అప్పటి గవర్నర్ రంగరాజన్ గారిని కలిసి ఆ స్థలాన్ని సినీ కార్మికులకీ చెందేలా చేశారు. అదే ఇప్పుడు మనకున్న చిత్రపురి కాలనీ.
ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులకు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయానికి న్యాయం చేశాం. 2015లో దాసరి నారాయణరావు గారు, మురళీ మోహన్ గారు కలిసి నన్ను ప్రెసిడెంట్ గా ఉండమని అడిగితే, ఆరోజు నాన్నగారు అడ్డుపడ్డారు. ఈ వయసులో ఎందుకు అని నన్ను వద్దని దాసరి గారికి సర్దిచెప్పారు.
ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న మురళీ మోహన్ గారు, నాన్న గారు, నాగబాబు గారు, రాజేంద్రప్రసాద్ గారు, శివాజీ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ప్రస్తుతం ఉన్న నరేష్ గారైతే కారోనా సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతో మంది తోటి ఆర్టిస్ట్ లకి అండగా నలిచారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ లు, పెన్షన్ లాంటివే కాకుండా తన సొంత డబ్బులు కూడా ఇచ్చి ఎంతోమందికి సహాయపడ్డారు. అసోసియేషన్ లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావనే అనుకుంటున్నా. మనం గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్ళి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం.
మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ గా ఉండి, నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కి హాజరైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ మా అసోసియేషన్ కోసం కట్టించబోయే భవనానికి అయ్యే మొత్తం ఖర్చులో 25 శాతం నేను, నా కుటుంబం ఇస్తామని చెప్పాను. 10-12 ఏళ్ళుగా ఆ బిల్డింగ్ కట్టాలని అందరూ అంటూనే ఉన్నారు.
ఇప్పటికి కూడా జరిగే ప్రతి ఎన్నికల్లో అదే ప్రధాన అజెండాగా వినిపిస్తోంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. ఈ భవన నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేనే ఇస్తాను.. నా కుటుంబంతో కలిసి ఆ భవనాన్ని నేను నిర్మిస్తాను. మన దృష్టిలో అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాదు. బిల్డింగ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు.. కట్టేద్దాం.. ఆ టాపిక్ కి ఇక ఫుల్ స్టాప్ పెడదాం. సభ్యత్వం లేకుండా చాలామంది సినిమాల్లో నటిస్తున్నారు. వారందరికీ సభ్యత్వం ఇవ్వాల్సిందే. మా లాంటి యువతను ఆశీర్వదించండి’ అంటూ సుదీర్ఘంగా ప్రకటన విడుదల చేశారు విష్ణు.
Must Read ;- ఎన్నికల కోసం ఆగలేకపోతున్న ప్రకాష్ రాజ్