వడ్డించేవాడు మనవాడైతే అనే సామెత భారతి సిమెంట్స్కు సరిగ్గా సరిపోతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికే చెందిన భారతి సిమెంట్స్కి ఏపీ ప్రభుత్వం నుంచి భారీగా సిమెంటు ఆర్డర్లు రావడమే ఇందుకు కారణం. ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వివాదాలకు తోడు..ఈ ఆర్డర్లు కూడా వివాదాంశంగా మారాయి. వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతి సిమెంట్స్కి ఏపీ ప్రభుత్వం నుంచి 2019 ఏప్రిల్ నుంచి జనవరి 18 వరకు 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్డర్లు వెళ్లాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ఈ కంపెనీలో వైఎస్ కుటుంబానికి 49శాతం వాటా ఉండగా వైకాట్ అనే ఫ్రాన్స్ కంపెనీకి 51 శాతం వాటా ఉంది. భారతి సిమెంట్స్కి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను దోచి పెట్టిందని టీడీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో కంపెనీకి వెళ్లిన ఆర్డర్ల సంఖ్యతో సహా సదరు పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఏపీ ప్రభుత్వం నుంచి మొత్తం ఆర్డర్లలో 14శాతం భారతి సిమెంట్స్కు వెళ్లాయని, ఇక భారతి సిమెంట్స్లో పెట్టుబడిదారుగా ఉన్న ఇండియా సిమెంట్స్కి (రెండో స్థానం) 1.59లక్షల టన్నుల ఆర్డర్లు వెళ్లాయి. ఈ కంపెనీలో కీలక వ్యక్తి శ్రీనివాసన్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన చరిత్ర కూడా ఇండియా సిమెంట్స్కు ఉంది. ఈ కంపెనీలు కాకుండా.. పెన్నా సిమెంట్స్కి 1.5లక్షల మెట్రిక్ టన్నుల ఆర్డర్లు వెళ్లాయని కథనం ప్రచురించింది.
నడుస్తున్న సీబీఐ విచారణ
ఇక భారతి సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్ (ఇప్పుడు లేదు..విలీనమైంది), దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్స్..ఇలా పలు కంపెనీలకు సంబంధించిన వివాదాలు, ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన కుమారుడైన వైఎస్ జగన్కి సంబంధించిన కంపెనీల్లో రకరకాల మార్గాల ద్వారా క్విడ్ ప్రోకోలో భాగంగానే పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరుగుతోంది. ఇక భారతి సిమెంట్స్ కంపెనీలో ఇండియా సిమెంట్స్ యాజమాన్యం 95.32 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన అంశం కూడా గతంలో వెలుగులోకి వచ్చింది. మొత్తం మీ ద భారతి సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్కి సింహభాగం ఆర్డర్లు వెళ్లినట్లు తేలడం మరోసారి చర్చనీయాంశమైంది.
Must Read ;- వైసీపీ ‘రివర్స్ టెండరింగ్’.. అయినవారికే పనులు
విచ్చలవిడిగా ధర పెంచేందుకేనా..
ఇక నిబంధనల విషయానికి వస్తే.. తాము చెబుతున్న తక్కువ ధరకు ఎవరూ బల్క్ ఆర్డర్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదని, ఒక్కో బస్తాకు రూ.225 చెల్లిస్తున్నామని,ఈ ధరకు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గతంలో రూ.230 చెల్లించిన సందర్భాలూ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో ప్రభుత్వం చెబుతున్న ధరలకు ప్రభుత్వానికి ఆ కంపెనీలు సిమెంటును సరఫరా చేసి, బయట మార్కెట్లో విపరీతంగా ధరలు పెంచాయని, ఒక్కో బస్తా ధర రూ.350-రూ.400 వరకు పెంచారని టీడీపీ ఆరోపిస్తుండగా ఆ ఆరోపణలకు బలాన్నిచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాగే సిండికేట్ అయి అనైతికంగా సిమెంటు ధరలు పెంచారన్న కారణంతో ఇండియా సిమెంట్స్కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున జరిమానా కూడా విధించిన ఘటనలనూ టీడీపీ తెరపైకి తెస్తోంది.
ఆ మాన్యుఫాక్చరర్స్ ఎవరు..
ఈ అంశంపై ప్రభుత్వం మాట్లాడుతూ.. ఈ కంపెనీల కోసమే ఆర్డర్ ఇవ్వలేదని, అన్నీ పారదర్శకంగా జరిగాయని చెబుతోంది. ఏపీ సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్కు తెలియజేసేలా ఆదేశాలు జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు తెలిపింది. ఇక్కడే మరికొన్ని విమర్శలు వస్తున్నాయి. భారతి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ కాకుండా.. బడా మాన్యుఫాక్చరర్లు ఎంత మంది ఉంటారని, ఒక వేళ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసక్తి ఏ కంపెనీలపై ఉంటుందో తెలుసుకుని అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తారనే ఆరోపణలూ వస్తున్నాయి. మొత్తం మీద సిండికేట్ అయ్యారని, ప్రజా ధనం దోచుకునేందుకు ఇలా చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ధరలను పెంచడం వల్లే తమకు రికార్డు స్థాయిలో లాభాలొచ్చినట్లు భారతి సిమెంట్స్.. తన వార్షిక నివేదికలో స్పష్టం చేసిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రభుతం, సదరు కంపెనీలు చెబుతున్నాయి.
Also Read ;- జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్ సంచలన వ్యాఖ్యలు