జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 7 గంటల పాటు 100కుపైగా ప్రశ్నలు అడిగారు. అత్యధిక ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానం దాటవేసినట్లు సమాచారం. విచారణకు పూర్తిగా మిథున్ రెడ్డి సహకరించలేదు. మద్యం వ్యవహారంతో తనకు సంబంధమేంటని..దర్యాప్తు అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. లిక్కర్ స్కాం కేసులో శనివారం మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో విచారణకు హాజరైన మిథున్ రెడ్డి..తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బయటకొచ్చారు. తొలి విడతలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలిచ్చారు. అసలు విషయాలు దాచిపెట్టారు. సంబంధం లేని అంశాలపై ప్రశ్నిస్తూ సమాధానాలు చెప్పమంటే ఎలాగని ఎదురుదాడి చేసినట్లు సమాచారం.
అప్పటివరకూ ఓపిక వహించిన దర్యాప్తు అధికారులు మధ్యాహ్న భోజన విరామం తర్వాత జరిగిన విచారణలో తమ వద్దనున్న పత్రాలు, ఆధారాలను చూపించి సూటిగా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు తెలిసింది. ఆయన చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలినట్లు సమాచారం. APSBCL మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రశ్నించారు. మిథున్రెడ్డి సిట్ కార్యాలయంలో మొత్తం ఎనిమిది గంటలపాటు ఉన్నారు. భోజన విరామం గంట మినహా ఏడు గంటలపాటు అధికారులు ఆయన్ను న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నించారు. విచారణ ముగిశాక ఆయన చెప్పిన వివరాల ఆధారంగా వాంగ్మూలాలు సిద్ధం చేసి వాటిపై సంతకాలు తీసుకున్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని, రావాల్సి ఉంటుందని చెప్పారు.
మిథున్ రెడ్డిని అడిగిన ప్రశ్నలు ఇవే –
1. సిట్: 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన నూతన మద్యం విధానం రూపకల్పనలో మీరే ప్రధాన పాత్ర వహించారని మా విచారణలో తేలింది? ఏ హోదాలో మీరు ఇందులో భాగస్వాములయ్యారు? మీకేంటి సంబంధం?
మిథున్రెడ్డి: మద్యం విధానం రూపకల్పనలో నా పాత్ర లేదు. సంబంధమూ లేదు. నేను అసలు అందులో భాగస్వామినే కాలేదు.
2. సిట్: మద్యం విధానం రూపకల్పనపై విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన తొలి రెండు సమావేశాల్లో మీరు పాల్గొన్నారని ఆయనే వెల్లడించారు కదా?
మిథున్రెడ్డి: విజయసాయిరెడ్డి అప్పట్లో మా పార్టీ ఎంపీ. సాధారణ సమావేశాల్లో భాగంగా కలిసుంటామే తప్ప మద్యం విధానంపై ఎలాంటి సమావేశాలు జరగలేదు.
3. సిట్: అవి మద్యం విధానంపై జరిగిన సమావేశాలేనని, అందులో మీతోపాటు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి (ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని), ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ పాల్గొన్నారని విజయసాయిరెడ్డి మా విచారణలో చెప్పారు.
మిథున్రెడ్డి: అవేవీ వాస్తవాలు కావు. అలాంటి సమావేశాల్లో నేను పాల్గొనలేదు.
ముడుపుల కోసమే నూతన మద్యం విధానం తెచ్చారా?
4. సిట్: మద్యం సరఫరా ఆర్డర్లు పొందే కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు, కొత్త బ్రాండ్ల తయారీకి వీలుగా ముందస్తు కుట్రలో భాగంగానే నూతన మద్యం విధానం రూపొందించారా?
మిథున్రెడ్డి: నాకు సంబంధం లేదని చెబుతుంటే అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?
5. సిట్: నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. అప్పట్లో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఈ కంపెనీకే అనుచితంగా దక్కాయి. ఇది మీరే ఏర్పాటుచేశారా?
మిథున్రెడ్డి: అదాన్ డిస్టలరీస్తో నాకెలాంటి సంబంధమూ లేదు.
6. సిట్: అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్తో మీకు సంబంధం లేకపోతే దాని ఏర్పాటుకోసం రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డితో కలిసి అరబిందో సంస్థ నుంచి రూ.60 కోట్లు ఎందుకు అప్పు తీసుకున్నారు?
మిథున్రెడ్డి: అవేవీ వాస్తవాలు కావు.
7. సిట్: మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలనుంచి ముడుపుల వసూళ్లకు నెట్వర్క్ రూపకల్పనలో మీ పాత్ర ఏంటి?
మిథున్రెడ్డి: అసలు ముడుపులే లేనప్పుడు దాని వసూళ్లు, నెట్వర్క్ రూపకల్పన ఎక్కడుంటుంది? ఇలాంటి ఊహజనిత ప్రశ్నలు సరికాదు.
8. సిట్: రాజ్ కసిరెడ్డితో కలిసి ముడుపులు వసూళ్ల నెట్వర్క్ను నడిపించినట్లు ఆధారాలున్నాయి. ఆయనకు, మీకు మధ్య నగదు లావాదేవీల సంగతేంటి? (కొన్ని బ్యాంకు స్టేట్మెంట్లు చూపించారు).
మిథున్రెడ్డి: అవన్నీ తప్పుడు ఆధారాలు.. నాకు సంబంధం లేదు.
9. సిట్: ముడుపుల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థ రూపొందించి సొమ్ము బిగ్బాస్కు చేర్చారా?
మిథున్రెడ్డి: నాకు తెలిసి అలాంటివేవీ జరగలేదు.
సంబంధం లేని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పమంటే ఎలా?
10. సిట్: వైకాపా అధికారంలోకి రాగానే మెజారిటీ డిస్టలరీల్లో పాగా వేసి జేబ్రాండ్లు ఉత్పత్తి చేయటంలో మీదే ప్రధాన పాత్ర.. కంపెనీలకు చెల్లించే మద్యం బేసిక్ ప్రైస్ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి ఎలా పొందారు?
మిథున్రెడ్డి: నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పమంటే ఎలా?
11. సిట్: మీ కుటుంబ సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. మద్యం కుంభకోణం సొమ్మును మళ్లించటానికి దీన్ని అడ్డం పెట్టుకున్నారు..
మిథున్రెడ్డి: మా ఖాతాలన్నీ సక్రమమే. అందులో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగలేదు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి…లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో తాను వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున కేసు, విచారణ అంశాలకు సంబంధించి తానేమీ మాట్లాడబోనన్నారు. సుప్రీంకోర్టులో నిర్ణయం వెలువడ్డాక ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై మద్యం కేసు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి మమ్మల్ని వేధిస్తున్నారని..ఇసుకలో వేల కోట్లు దోచేశారని, వందల గనులు అన్యాక్రాంతం చేశానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఇది తప్పుడు కేసని, ఇలాంటివాటికి భయపడేది లేదు. ధైర్యంగా ఎదుర్కొంటానని మిథున్ రెడ్డి వివరించారు