తెలంగాణ రాష్ట్ర శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికలు వేడి రాజేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ కారణంగానే ఆ తేదీలోపు శాసన మండలి ‘నల్లగొండ– వరంగల్–ఖమ్మం, ’మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి’ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొందరు ఆశావహులు సిద్ధమవుతుండగా.. రాజకీయ వర్గాల్లో అపుడే హడావిడి మొదలైంది. ఇప్పటికే ఈ రెండు స్థానాలపై దృష్టిపెట్టిన ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
ఈ ఆరు జిల్లాలకు చెందిన నేతలు ఈ స్థానాలపై ఎంతో ఆశతో ఉన్నారు. ప్రస్తుతం నల్లగొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గం నుంచి మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, మహూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్.రామచందర్రావు (బీజేపీ) ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిద్దరి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో పూర్తవుతోంది.
అంటే మరో ఏడు నెలల గడువు మిగిలే ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో కదలిక వచ్చింది. పట్టభద్రుల ఓట్ల నమోదు మొదలు కానుంది. దీనికోసం పోటీ చేయాలని ఆశిస్తున్న వారు సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ రెండు స్థానాల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీలు చెరో చోట ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ పార్టీకి చెందని వారు బరిలో ఉండే అవకాశం ఉందన్న విషయం బయటకు పొక్కలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉంటారా..? ఉండరా..? లేక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారా అన్న విషయాన్ని కూడా ఆ రెండు పార్టీల నాయకులు చెప్పలేక పోతున్నారు.
జిల్లాలతో సంబంధాలు ఉన్న వారు ఓటర్లను చేర్పించడం, చిన్న చిన్న మీటింగుల ద్వారా వారిని కలుసుకోవడం, కరోనా నేపథ్యంలో వీలయితే ఇప్పటి నుంచే తక్కువ మంది అనుచరులతో ఓటర్లను వ్యక్తిగతంగా కలిసే ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు.
ఆశల్లో… ఆశావహులు
నల్లగొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గం నుంచి తెలంగాణ జనమితి (టీజేఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన శుక్రవారం భువనగిరిలో అనుయాయులను కలిసి వెళ్లారు. మరో వైపు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ జర్నలిస్ట్ రాణి రుద్రమ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపున ఇదేనియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మరో జర్నలిస్ట్ ఖమ్మం జిల్లాకు చెందిన పి.వి.శ్రీనివాస్ రావు, కారెం రవీందర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.
టీఆర్ఎస్లో … గ్రాడ్యుయేట్స్ గుబులు..?
మరో వైపు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎవరెవరు అభ్యర్థులుగా పోటీకి దిగుతారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, టీఆర్ఎస్లో కొందరు నాయకులు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి ఇబ్బందేమీ లేదని తమ సన్నిహిత నాయకుల వద్ద చెప్పుకుంటున్నారు. కాగా, కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారా… టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బలమైన ఇతర పార్టీల, స్వతంత్ర అభ్యర్థికి సహకరిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
అయితే.. 2019 మార్చిలో జరిగిన ‘నిజామాబాద్– ఆదిలాబాద్–కరీంనగర్’ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంతిర టి. జీవన్రెడ్డి విజయం సాధించారు. ఈ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సారి రెండు నియోజకవర్గాల నుంచి అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తారా ..? లేదా..? అన్న సంశయాలూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆపార్టీ నాయకత్వం జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి.
నిరుద్యోగభృతి హామీ ఒక చిక్కే!
రాష్ట్ర శాసన సభకు 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కదలిక, స్పందనా కనిపించడం లేదు. మరో వైపు ఉద్యోగ రిక్రూట్మెంట్ దాదాపుగా నిలిచిపోయింది. లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ పరీక్షలకోసం సమయాన్ని, డబ్బుని కేటాయించి నిరాశలో ఉన్నారు. ఈ ఎన్నికే గ్రాడ్యుయేట్స్ ఓట్లతో ముడిపడి ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్కు ప్రతికూల వాతావరణమే ఉంది. ఆ పార్టీలో గ్రాడ్యుయేట్స్ గుబులు లేకపోలేదు.
ఈ కారణంగానే తన అభ్యర్ధులను నిలబెడుతుందో లేదో అన్న శంక పార్టీ నాయకులను పీడిస్తున్నా.. టికెట్పై మాత్రం బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మండలి ఎన్నికల్లో పోటీ చేస్తుందా..? లేదా..? అన్న విషయం ఎవరూ చెప్పలేక పోతున్నారు. కారణం.. ఈ ఎన్నికకు ఎంత లేదన్నా.. తక్కువలో తక్కువగా రూ.10కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ మొత్తాన్ని భరించేందుకు ముందుకు ఎవరు వస్తారనేది.. ఆ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న. మరో వైపు పార్టీలో నాయకత్వం కోసం జరుగుతున్న ఇంటి పోరు మరింత సమస్యగా పరిణమించింది. మొత్తంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వివిధ సమీకరణల చుట్టూ తిరుగుతోంది.