తెలంగాణ ఉద్యమం…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ రెండు మాటలు వింటే చాలు..నాటి ఉద్యమ స్మృతులు గుర్తుకొస్తాయి. నీళ్లు, నియామకాలు, నిధులు అనే నినాదంతో మలిదశ తెలంగాణ ఉద్యమ నాదం… దేశమంతా మారుమోగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నం సాకారమైంది. ఆ క్షణాన అందరిలో ఆనందం, సంబురాలు విరబూసాయి. దశాబ్దాల తరుబడి పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కళ్లముందు కదలాడుతుంది. ఈ ఉద్యమంలో ఎందరో ఆత్మ బలిదానాలు, త్యాగాలు, పోరాటాలు చేయబట్టే తెలంగాణ రాష్ట్రం సాకారమైందనేది సత్యం. ఇందులోనూ ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. ఎందుకంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చడానికి విద్యార్థులు ముందుండి కొట్లాడిన్రు. తమకు ఉద్యోగాలొస్తాయని. మన ఉద్యోగాలు..ఆంద్రా వాళ్ళు తన్నుకుపోతున్రనే ప్రకటన నాటి ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడేలా చేసింది కాబట్టి. ఈ క్రమంలోనే ఉస్మానియా, కాకతీయ, సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఉద్యమ రూపం మిగతా జిల్లాలకు…గ్రామాలలోని విద్యార్థుల గుండెకు చేరువై రాష్ట్ర ఏర్పాటుకు దోహదమైంది.
లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళీలు, రబ్బర్ బులెట్లు, బూటు కాళ్ల దెబ్బలు తిన్నారు. ఈ ఉద్యమంలో సుమారు 1200 మంది వరకు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ ఉద్యమం కొంతమంది తల్లు లకు గర్భశోకం మిగిల్చితే…మరొ కొంత మంది పిల్లలకు వారి తండ్రులను దూరం చేసింది. అక్కకు తమ్ముడినీ..చెల్లికి అన్నను ఇలా ప్రతి బంధాలను దూరం చేసింది. ఇదంతా దేనికోసం చేశారంటే….ఆ కుటుంబాలది ఒక్కటే సమాధానం..తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడుతాయని, ఉద్యోగాలు వస్తాయని అంటారు. కానీ ఇంతలా కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణలో ఇప్పడు నీకేమొచ్చిందని ప్రశ్నించుకుంటే కనుచూపుమేరలోనూ సమాధానం దొరకటంలేదు. ఇంతకు ముందులానే మళ్లీ ఉద్యోగాల కోసమనీ.. హక్కుల కోసమనీ.. విద్యార్థులు, ఉద్యోగులు, సంఘాలు ఇంకా కొట్లాడుతునే ఉన్నరు.
సొంతరాష్ట్రంలోనూ ఆగని చావులు…
మొన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నసమయంలో అసెంబ్లీ సమీపాన కడ్తల్ గ్రామానికి చెందిన నాగులు అనే ప్రైవేట్ టీచర్…తనకు బతకడానికి ఉద్యోగం లేదని ఒంటిమీద పెట్రలో పోసుకొని ఆత్మ బలిదానం చేసిన విషయం తెలిసిందే. నిన్న(ఈనెల 18) ఇల్లు ఇయ్యలేదని చందర్ అనే ఆటోడ్రైవర్ ప్రగతిభవన్ ముంగిట కిరోసిన్ పోసుకుని ప్రాణం తీసుకుబోయిండు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నడు. సొంత రాష్ట్రం వచ్చినాక తన బతుకు బాగైతదనుకున్నడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తదనుకున్నడు. కానీ రాకపోవడంతో ఆవేదనతో కిరోసిన్ పోసుకోని ప్రాణాలు తీసుకోవాలనుకున్నడు.
పనికోసం లడాయి….
తెలంగాణ ఉద్యమంలో అన్ని విభాగాల పాత్ర ఉన్నది. జీతాలు పెరుగుతాయని, ఉద్యోగాలు పర్మినెంటవుతాయని, తమకొలువులు యాడికిపోవని పదిలంగా ఉంటాయని భావించి పోరాటంలో దిగిన్రు. మరీ తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగ భద్రత కోసం ధర్నాలు చేయాల్సి వస్తుందని ఉపాధీ హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన చెంది శుక్రవారం పోరుబాట పట్టిన్రు. తమ సమస్యల పరిష్కారం కోసమని గతంలో వారు సమ్మె చేసిన్రని దీంతో దాదాపు 7700 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. తమకు తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని నిన్న పంచాయితీరాజ్, గ్రామీణాభివఈద్ధి శాఖ కమిషనరేట్ ను ముట్టడించే ప్రయత్నం చేసిన్రు.
జీతం కోసం కొట్లాడుడే….
అలాగే హెల్త్ స్టాఫ్..తమకు ఐదు నెలల సంది నుంచి జీతాలు ఇస్తలేరని ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆఫీసు ముందు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిన్న ధర్నా చేసిన్రు. కరోనా నివారణ వ్యాప్తిలో హెల్త్ సిబ్బంది పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రమాదమని తెలిసినా వైద్యులతో సమానంగా కరోనాతో పోరాడుతూ రోగుల ప్రాణాలను నిలబెడుతున్నరు. ఐదు నెలలుగా జీతాలు రావడంలేదని ధర్నాలో పాల్గొన్నారు. ‘పస్తులతో పని ఎట్లా చేయాలి సారూ…’అని ఆవేదనతో అడుగుతున్నరు. నిజంగా ఒక్క నెల జీతం లేటైతెనే మన ఇళ్లు గడవడం కష్టం. మరీ ఐదు నెలల జీతాలు రాకుంటే వాళ్ల పరిస్థితి ఏంటీ సారూ?
గతంలో ఆర్టిసీ కార్మికులు కూడా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే వివిధ డిమాండ్లతో 50 రోజుల వరకు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అయినా పెద్దలు వారి సమస్యలను పట్టించుకోలే. అరె కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా? అని కొన్ని వర్గాలు ఆవేదనతో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎవరు లాభపడ్డారనే ప్రశ్నలు వారిని కలచివేస్తున్నాయి. మన సమస్యలను పరిష్కారమవుతాయనుకుంటే స్వరాష్ట్రంలో వినేవారే లేకుండా పోయారని మదన పడుతున్నరు. జీతాల కోసం ఉద్యోగులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇలా లడాయి చేస్తునే ఉన్నరు. మన అనే తెలంగాణ నినాదం…నాదం ఎవరి చేతిలోకి పోయిందనే ప్రశ్న చాలా మంది కిందిస్థాయి వర్గాల ప్రజల్లో, విద్యార్థుల మెదడులను తినేస్తుంది. కొట్లాడి, ప్రాణాలిచ్చి, లాఠీ దెబ్బలు తిని, జైలు ఊచలు లెక్కబెట్టి సాధించుకున్న తెలంగాణాలో ‘ నీకు‘ ఏం మంచి జరిగిందంటే సమాధానం వాళ్లలో లేదు.
నాడు ఉద్యమంలో పాల్గొన్న వారు… అసలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు కొట్లాడినమా అని ఇప్పుడు అనుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. మొత్తానికైతే కొన్ని వర్గాలు తెలంగాణలోని పరిస్థితులపై నిశ్శబ్ధంతో ఉన్నారు. ఉద్యమ ప్రగతి ఫలాలు అందరినీ ఆనందంలో ముంచెత్తాలి. కానీ నైరాశ్యం, అసహనం, బాధలో నెట్టేయకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అలాంటిదేనని కొందరు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నరు. ఉద్యోగాల కోసం, జీతాల కోసం, సమస్యల పరిష్కారం కావడం కోసమనీ కొట్లాడే తెలంగాణ పోయి…బంగారు తెలంగాణ రావాలని ఆశిద్దాం.