ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని నాయకుడు. కాపు వర్గానికి సంబంధించి.. ఆ వర్గీయుల్లో విశ్వసనీయత ఉన్న నాయకుడిగానూ గుర్తింపు ఉంది. ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నప్పటికీ.. కాపు ఎజెండాను మాత్రం పక్కన పడేయలేదు. కాపు అంశాలపై పదేపదే గళమెత్తుతూ ఉంటారు. కాపులను బీసీల్లో చేర్చాలనే అంశానికి సంబంధించి చంద్రబాబునాయుడు హయాంలో ఆయన ఎన్నెన్ని రకాలుగా ఉద్యమించే ప్రయత్నం చేశారో కూడా అందరికీ తెలుసు! ఆ రకంగా తెలుగుదేశం పట్ల వ్యతిరేకత ఉన్న నాయకుడిగానూ ఆయన ముద్రపడ్డారు. జగన్ కోసమే ఇదంతా చేస్తున్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. ఆయన మాటలను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అనేకరకాలుగా సమర్థించి.. అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. అలాంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి రాసిన ఒక లేఖ సంచలనంగా మారుతోంది.
ఒక ముద్రగడ పద్మనాభం లేఖలో దాదాపుగా ఒకే ఒక్క వాక్యం!
కానీ ఆ ఒక్క వాక్యం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కొరడా దెబ్బ లాంటి వాక్యం. జగన్మోహన్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించే శైలికి నిదర్శనం లాంటి వాక్యం. రాజకీయ ప్రత్యర్థులపై జగన్ సర్కారు ఎంత దారుణంగా పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నదో.. కుట్రపూరితంగా వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదో పరోక్షంగా ప్రజలందరికీ గుర్తు చేసే ఒకే ఒక్క వాక్యం. ఇంతకూ ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో ఒక ఫోటోను కూడా జత చేసి.. రాసిన ఒక్క వాక్యమూ ఏంటో తెలుసా…?
‘‘ఈ ఉత్తరంలో విజయనగరం మహారాజా వారి కుమారులు గౌరవ అశోక గజపతి రాజు గారిని బిజెపి అగ్రనాయకులు గౌరవ అద్వానీ గారు ఎలా గౌరవించారో చూడడం కోసం ఆ ఫోటోను తమరికి పంపినాను.’’
అంతే ఆయన రాసింది ఒక్క వాక్యమే. ఆ ఒక్క వాక్యంలో చెప్పదలచుకున్న అంశాన్ని మరింత ఘాటు చేరేలా.. ‘‘ఇక పంపనండి, నిర్ణయం తమరిదేనండి.’’ అంటూ రెండు పొడిమాటలు కూడా జత చేశారు.
లేఖ మొత్తంలో ‘‘ముద్రగడ పద్మనాభం నమస్కారములు..’’ అనే పలకరింపును మినహాయిస్తే.. కింద మరోసారి నమస్కారాలు మాత్రం ఉన్నాయి.
ఆ మాటల కింద బీజేపీ నేత ఎల్కే అద్వానీ, అశోక్ గజపతి రాజును కలిసినప్పటి ఒక ఫోటోను ఇచ్చారు. అశోక్ గజపతి రాజుతో పోలిస్తే.. అద్వానీ ఏ రకంగా చూసినా సరే.. పోల్చడానికి చాలనంత అగ్ర నాయకుడు. దేశవ్యాప్తంగా అసమానమైన క్రేజ్ ఉన్న నాయకుడు కూడా! అయితే ఆ ఫోటోలో.. అశోక్ గజపతితో అద్వానీ కరచాలనం చేస్తున్నారు. అదికూడా ఎలాగ? అశోక్ గజపతి ఒక చేతిని అందిస్తోంటే.. అద్వానీ రెండు చేతులతోనూ దానిని అందుకుని, వంగి మరీ ఆయనతో కరచాలనం చేస్తున్నారు. ఆ రకంగా అశోక్ గజపతి పట్ల, అంతటి సీనియర్ నాయకుడు గౌరవ మర్యాదలను ప్రకటిస్తున్న ఫోటోను ముద్రగడ జగన్కు పంపారు.
ఇందులోనే అసలు సారాంశం అంతా ఉంది.
Must Read ;-‘ధర్మరాజు’లపై రాజకీయ క్రీడ.. అశోకుడిని చూడగానే అక్రమాలు గుర్తొస్తున్నాయ్
అశోక్ గజపతిని జగన్ సర్కారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు..
అశోక్ గజపతిని జగన్ సర్కారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నదో ప్రజలందరికీ తెలుసు. జగన్ అధికారంలోకి రాగానే.. అశోక్ ఛైర్మన్గా ఉన్న వారి కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్టును అరాచకమైన రీతిలో సంచయిత చేతిలో పెట్టారు. వంశపారం పర్యంగా వచ్చే సింహాచలం దేవస్థానం ఛైర్మన్ పదవి నుంచి అశోక్ను తప్పించి.. సంచయితకు పట్టాభిషేకం చేశారు. మాన్సాస్ ట్రస్టు ద్వారా.. అశోక్ కుటుంబం వేల కోట్ల రూపాయల విలువైన వితరణ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అశోక్ కుటుంబం మంచితనం, నిజాయితీ, వితరణశీలత పట్ల పార్టీలు ప్రాంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రజలందరిలోనూ ఒక సదభిప్రాయం ఉంది. ఆ ట్రస్టుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల విలువ కూడా.. అనేక వేల కోట్లకు పై మాటే అని అందరూ చెబుతుంటారు. దాదాపు వందకు పైగా ఆలయాలకు అనువంశిక ఛైర్మన్గా ఉంటే అశోక్ గజపతిని తప్పించిన తర్వాత.. రామతీర్థం ఆలయంలో విగ్రహాలు ధ్వంసమైతే.. ఆ ఆలయాన్ని కట్టించిన కుటుంబానికి వారసుడిగా అశోక్ గజపతి కొత్త విగ్రహాల తయారీకి విరాళం ఇచ్చినా కూడా తీసుకోకుండా ఆ చెక్కును తిప్పి పంపి దారుణంగా అవమానించారు.
ఇన్ని అవమానాల మధ్య అశోక్.. కోర్టు ద్వారా ప్రభుత్వపు తప్పుడు నిర్ణయాన్ని అడ్డుకోగలిగారు. అనువంశిక ధర్మకర్త స్థానం తిరిగి ఆయనకు దక్కింది. సంచయిత నియామకం చెల్లకుండా పోయింది. అప్పటికీ.. దేవస్థానానికి వెళితే..ప్రోటోకాల్ మర్యాదలు పాటించకుండా అధికారుల్ని నియంత్రించి.. తమకు కోర్టు మొట్టికాయ వేసినా మర్యాదలు నేర్చుకోకుండా జగన్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరించింది.
విజయసాయిరెడ్డి మాటలతో..
మరోవైపు.. ఉత్తరాంధ్ర రాజకీయాలను తన కనుసన్నల్లోకి తెచ్చుకోవాలని తపన పడుతున్న విజయసాయిరెడ్డి.. త్వరలోనే అశోక్ గజపతి జైలుకు వెళ్తారంటూ ఒక ప్రకటన కూడా చేశారు. ఇది చూడగానే ఆయనను అభిమానించే వారిలో ఒక ఆందోళన పుట్టింది. తెలుగుదేశం నాయకులను ఏదో ఒక ఆరోపణలపై ఒక్కసారైనా జైలుకు పంపి.. అక్కడితో ఒక రకమైన శాడిస్టిక్ ఆనందం పొందుతున్న వారు.. అశోక్ గజపతిని కూడా జైలుకు పంపడానికి ఒక కొత్త కుట్ర రచన చేస్తున్నారనే అభిప్రాయమూ కలిగింది. విజయసాయి మాటలు ప్రజలకు అలాంటి అనుమానం కలిగించాయి.
అశోక్ గజపతి పట్ల జగన్ ప్రభుత్వం ఇంత ఘోరంగా, అతిగా వ్యవహరిస్తుండగా.. ముద్రగడ పద్మనాభం.. ఒకే ఒక్క ఫోటోను జత చేసి, ఒకే ఒక్క వాక్యం లేఖ రాయడం ద్వారా.. జగన్ ప్రభుత్వ తీరుపై కొరడా దెబ్బ వంటి విమర్శ చేశారు. అశోక్ క్రెడిబిలిటీకి తార్కాణం లాగా ఆయనతో అద్వానీ ఎంత మర్యాదగా వ్యవహరించేవారో చూపిస్తూ.. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నదో చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం నాయకులు విమర్శిస్తే.. వైసీపీ వందిమాగధులు వాటిని తిప్పికొట్టవచ్చు. కానీ.. తెలుగుదేశంతో ఎలాంటి సంబంధం లేని.. ఈ తటస్థ నాయకుడు ముద్రగడ విమర్శ విషయంలో ఏం మాట్లాడుతారు? ఇప్పటికైనా తమ పద్ధతి సరైనది కాదని, ప్రజలు కూడా ఈసడించుకుంటున్నారని ప్రభుత్వం తెలుసుకోగలుగుతుందా?
Must Read ;- రాజు గారి ఫైరింగ్.. ఆ ‘కుక్క కాపలా‘ ఏంటీ?