గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తతపై మంత్రి బొత్స వ్యాఖ్యలకు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా బదులిచ్చారు.లోకేశ్ పై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలో, కడుపు మండిన వాళ్లో ఎవరికి తెలుసని.. చిల్లరగా ఉంటే… చిల్లరగానే ఉంటుందన్న బొత్స వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వైయస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని 2012లో బొత్స చేసిన వ్యాఖ్యల తాలూకు పేపర్ క్లిప్పింగ్ ను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
వైయస్ మృతి వెనుక జగన్ హస్తం ఉంది. వైయస్ విజయలక్ష్మి, జగన్ తీరు దొంగే… దొంగ దొంగ అని అరిచినట్టు ఉందంటూ నీ అంత డిగ్నిఫైడ్ గా మాట్లాడటం మా లోకేశ్ కి రాదు బొత్స సత్తిబాబు అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. సొమ్ములు పోనాయ్ ఏటి సేత్తాం అని చిల్లరగా మాట్లాడి మంత్రిగా ఫెయిల్ అయిన నీలాంటి వాళ్లపై దాడులు జరిగితే కడుపు మంట అనుకోవడంలో తప్పు లేదు. మహిళలకు అండగా నిలుస్తున్న లోకేశ్ ని చూసి అక్కసుతో గ్యాస్ ఎక్కువై జగన్ రెడ్డి పంపిన రౌడీలు రాళ్లు విసిరితే కడుపుమండి ఎవరో చేశారని కవరింగ్ ఎందుకు బొత్సా?’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా తుమ్మపూడిలో గ్యాంగ్ రేప్ కి గురై, హత్య కాబడిన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై వైసీపీ నాయకులు రాళ్లదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయనకు ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. కాగా ఈ అంశం పై స్పందించిన లోకేష్ వైసీపీకి హాట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.