విద్యావేత్త, టీడీపీ హయాంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన పరకాల ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పార బట్టారు. మహాటీవీ డైరెక్టర్ పదవి నుంచి ఇటీవలే తప్పుకున్న ఆయన ‘రైట్ ఫోలియో’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆయనకు ఆర్థిక అంశాలపై మంచి పట్టు ఉంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఆర్థిక విభాగాల చైర్మన్ గా కూడా పని చేశారు. తాజాగా ఆయన కరోనా సమయంలో కేంద్రం అవలంబిస్తున్న విధానాలను తప్పు పట్టారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ఆలోచనలు కేంద్రం వద్ద లేవని అందుకే గాడ్ ఆఫ్ యాక్ట్ అంటున్నారని విమర్శలు చేశారు. కరోనా ఆలస్యంగా వచ్చిందని అంతకు ముందే దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చురకలు అంటించారు.
పరకాల ప్రభాకర తన అర్ధాంగి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశ జీడీపీ గత 40 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మైనస్ 23.9 శాతానికి పడిపోవడం కేంద్రం విధానాలే కారణమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించలేని స్థితి రావడానికి కారణం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’గా నిర్మలా సీతారామన్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కంటే ఆర్థిక మందగమనం ముందు నుంచే ఉందని ఈ అంశాన్ని తాను ముందే చెప్పినా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన చర్యలు తీసుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని లేకపోతే దారుణమైన పరిస్థితులు ఎదురుకానున్నాయని హెచ్చరించారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షభం రానుందని అక్టోబర్ లోనే పరకాల కేంద్రానికి నివేదికలు పంపారు. కానీ కేంద్రం పరకాల పంపిన నివేదికలను బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు జీడీపి మైనస్ 23.9 శాతానికి చేరుకోవడంతో వాస్తవం బోధపడింది. దయచేసి దేవుడు కోసం ఏదో ఒకటి చేయండి అని పరకాల సైటర్లు వేసినట్లు కనిపిస్తున్నా అది నిజమేనంటూ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో జీడీపీ గ్రోత్ రేట్ మైనస్ కి వెళ్ళింది. ఇదే సమయంలో కరోనా కారణంగా ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. వినియోగదారుడి కొనుగోలు శక్తీ లేకపోవడంతో మార్కెట్ లో లావాదేవీలు జరగడం లేదు. ఈ తీరు ఇలాగే కొనసాగితే 1990లో మన దేశం ఎదురుకున్న గడ్డు పరిస్థితులు పునరావృతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.