2018లో రిలీజ్ అయిన ‘అంధాధున్’ అనే బాలీవుడ్ చిత్రం ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించారు. ఆయుష్మాన్ ఖురానా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగులో ‘అంధాధున్’ రీమేక్ హీరోగా నితిన్ నటిస్తుండగా, హీరోయిన్లగా తమన్నా, నభా నటేష్ కనిపించనున్నారని తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు.
నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాల తర్వాత ‘అంధాధున్’ రీమేక్ లోనే నటించబోతున్నాడు. అలాగే తమిళంలో కూడా ‘అంధాధున్’ రీమేక్ కానుంది. ఆయుష్మాన్ ఖురానా పాత్రలో తమిళ్ సీనియర్ హీరో ప్రశాంత్ నటిస్తుండగా, టబు పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్తో సంప్రదింపులు జరుగుతున్నాయి. తమిళ్ లో కూడా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత షూటింగ్ సెట్స్ పై వెళ్లనుందని వినికిడి.
ఇక తాజా సమాచారం ప్రకారం ‘అంధాధున్’ చిత్రం మలయాళంలో కూడా రీమేక్ కానుంది. ఇప్పటికే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించిందట. మలయాళం రీమేక్ లో స్టార్ హీరో పృథ్వీరాజ్ నటిస్తున్నాడని, అలాగే టబు పాత్రలో మమతా మోహన్ దాస్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పృథ్వీరాజ్ ఈ సినిమాపై సానుకూలంగా ఉన్నాడని, త్వరలోనే సినిమా షూటింగ్ సెట్స్ పై వెళ్లనున్నదని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.