జగన్ హయాంలో రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా పని చేసిన సీనియర్ IPS PSR ఆంజనేయులు ఆ హోదాలో పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ,జనసేన సహా అప్పటి ప్రతిపభ పార్టీల్లోని ముఖ్య నాయకులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు, వైసీపీకి, ముఖ్యంగా నాటి సీఎం జగన్కు గిట్టని రాజకీయ ప్రత్యర్థులపై అక్రమంగా కేసులు పెట్టించడం, అరెస్టు చేయడంలో PSRదే కీ రోల్ అన్న ఫిర్యాదులు ఉన్నాయి. జగన్ హయాంలో కొనసాగిన అణచివేత, వేధింపులు, ప్రతీకార, కక్ష సాధింపు చర్యల ప్లాన్లో PSR మాస్టర్ మైండ్గా వ్యవహరించారని సమాచారం.
అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, జైలుకు పంపించడంలోనూ కీలక పాత్రధారి PSR అనే అభియోగాలున్నాయి. తమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను భయపెట్టి అణచివేశారు. తాడేపల్లి ప్యాలెస్కు కళ్లు, చెవుల్లా పనిచేసి, నాటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగి, IPS అనే సంగతిని విస్మరించి, వైసీపీ ప్రతినిధిలా వ్యవహరించారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. సినీ నటి జెత్వానీపై అక్రమ కేసు వ్యవహారంలో PSR అరెస్టైన నేపథ్యంలో..గత ప్రభుత్వంలో ఆయన సాగించిన అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈసీ బదిలీ చేసినా –
గత ప్రభుత్వ హయాంలో, సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల కదలికలు, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులకు చేరవేయడానికి PSR నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఫిర్యాదులున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ సేవలో తరించారనే ఫిర్యాదులతో ఈసీ ఆయన్ను బదిలీ చేసింది. అప్పటి నుంచి వెయిటింగ్లోనే ఉన్నారు. తర్వాత జెత్వానీ కేసులో గతేడాది సెప్టెంబరులో సస్పెండయ్యారు. నిఘా విభాగాధిపతిగా ఆయన పూర్తిగా వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారనే ఆరోపణలున్నాయి. అంతకుముందు ఏసీబీ డీజీ పోస్టులో ఉంటూ, నాటి తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తదితరులను కేసులతో వేధించారు. తెరపై ఎక్కడా కనిపించకుండా ప్రతిపక్ష నాయకుల్లో ఎవరిని, ఎక్కడ దెబ్బతీయాలో వ్యూహరచన చేసి, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని అణచివేసే ప్రయత్నం చేశారు.
APPSCలోనూ అక్రమాలు –
టీడీపీ హయాంలో APPSC ఛైర్మన్గా నియమితులైన ఉదయ్భాస్కర్..వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పోస్టు నుంచి తప్పుకొన్నారు. ఆయన పదవిలోంచి వైదొలిగేలా PSR తీవ్రంగా వేధించారనే విమర్శలున్నాయి. ఆంజనేయులు APPSC కార్యదర్శిగా, గౌతమ్ సవాంగ్ ఛైర్మన్గా ఉన్న సమయంలో గ్రూపు-1 ఉద్యోగాల అమ్మకాల్లో రూ.150-200 కోట్ల మేర అవినీతి జరిగిందని అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్లో రూపొందిన జాబితా మేరకు గ్రూపు-1 అభ్యర్థులు ఎంపికయ్యేలా మూల్యాంకన చేశారని సోదాహరణంగా చెప్పారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని అప్పట్లో డిమాండు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో PSR హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై పోలీసు శాఖ దృష్టి సారించింది. దీనిపైనా కేసు పెట్టే అవకాశముంది.
ఉద్యోగ సంఘాలపై అణచివేత
ఉద్యోగుల PF సొమ్మును వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా డ్రా చేస్తోందని, సకాలంలో వేతనాలివ్వట్లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అప్పట్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఆంజనేయులు ఆయనపై కక్ష కట్టారు. సూర్యనారాయణపై అక్రమ కేసు బనాయించి, ఆయనతో పాటు కుటుంబాన్నీ తీవ్రంగా వేధించారు. సుప్రీంకోర్టులో బెయిల్ పొందేవరకూ ఆయన అజ్ఞాతంలో గడిపారు. నాకు బెయిల్ లభించాక, అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ నన్ను పటమట పోలీసుస్టేషన్కు పిలిపించారు. పీఎస్ఆర్తో వీడియో కాన్ఫెరెన్స్లో మాట్లాడించారు. చంద్రబాబు వద్దకు వెళ్తే నిన్ను కన్పించకుండా చేస్తానంటూ నాడు పీఎస్ఆర్ బెదిరించారని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఐడీకి ఫిర్యాదు చేయగా, దానిపైనా విచారణ కొనసాగుతోంది.
సస్పెన్షన్లో ఉన్నా…వైసీపీ కోసమే –
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆంజనేయులు తీరు మారలేదు. సస్పెన్షన్కు గురయ్యాక హైదరాబాద్లో ఉంటూ వైసీపీ సేవలో తరిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా కేసుల్లో నిందితులు, అనుమానితులుగా ఉన్న అధికారులు, వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులిస్తే ఎలా స్పందించాలి? విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి? పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరక్కుండా ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. మద్యం కుంభకోణం కేసు నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అజ్ఞాతంలోకి పంపించడంలోనూ PSR కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. పోలీసు శాఖలో కొందరు ఐపీఎస్లు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో ఆయన ఓ నెట్వర్క్ నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి.