వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపైనా, పార్టీ అధిష్టానం పైనా కన్నెర్ర చేస్తున్న ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. “నేను ఎందుకు రాజీనామా చేయాలి. నేను ఎవరి బొమ్మనో పెట్టుకుని ఎన్నికల్లో గెలవలదు. . నా ముఖమే నన్ను గెలిపించింది “ అని ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. నరసాపురం ప్రజలకు తన ముఖం తెలుసునని, వారంతా తనకే ఓటు వేసారని మరోసారి స్పష్టం చేశారు.
తనను గెలిపించిన ప్రజలకు తన గురించి తెలుసునని, అలాగే తన రక్తం పీల్చేసిన అక్కడి ఎమ్మెల్యేలకు కూడా తెలుసునని ఆయన అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన రఘురామ కృష్ణం రాజు పార్టమెంట్ కార్యదర్శని కలుసుకున్నారు. అలాగే, పార్లమెంట్ వ్యవహారాల మంత్రిని కూడా కలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
మీరే రాజీనామా చేయండి…
రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటలను ఇప్పుడు వదిలేశారని, ఇందుకు ప్రతిగా అధికారంలో ఉన్న వారంతా తమ పదవులకు రాజీనామా చేయాలని రఘురామ కృష్ణం రాజు సూచించారు. “రాజధానిగా అమరావతికి మీరు ఓటు వేశారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఇప్పుడు రాజధానిని మార్చేస్తున్నారు.
దీనికి బాధ్యత వహిస్తూ మీరంతా రాజీనామా చేయాలి“ అని ఆయన స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ పార్టీకి విధేయుడనేనని, పార్లమెంట్ సాక్షిగా ఈ విషయం చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. “ పార్టీ ఆనాడు చేప్పిన మాటను నేడు నేను గుర్తు చేస్తున్నాను. అమరావతికి కట్టుబడి ఉండాలి “ అని రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు.
ఆయనను మేం సస్పెండ్ చేయం : మిథున్ రెడ్డి
తమ పార్టీ నుంచి గెలిచిన రఘురామ కృష్ణం రాజు ప్రతిపక్షాల ఎజెంతో పని చేస్తున్నారని లోక్ సభలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. రఘురామ కృష్ణం రాజును తాము సస్పెండ్ చేయమని, ఆ అవసరం కూడా తమకు లేదని ఆయన చెప్పారు. అయితే రఘురామ కృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాల్పిందిగా కోరతామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన తన వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి చేటు చేస్తున్నారని, ఇలాంటి వైఖరిని ఏ పార్టీ అంగీకరించదని ఆయన అన్నారు.
“సహచర ఎంపీగా మేం ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చాం. ఇస్తున్నాం. ముందు ముందు ఇస్తాం కూడా. ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవాలి“ అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలలో మొన్నటి వరకూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎంపీల దగ్గరే కూర్చున్న రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారో వేచి చూడాలి.