రామయ్య లండన్ వెళ్లారు. ఒక్కరే కాదు…. వనవాసానికి వెళ్లినట్లుగానే సీతా లక్ష్మణ సమేతుడై లండన్ వెళ్లారు. ఇలా వెళ్లినందుకు పాస్ పోర్టులు లేవు. వీసాలు లేవు. ఇంట్లో పిల్లాడు తప్పిపోయినట్లుగా తమిళనాడులో తప్పిపోయి లండన్ లో తేలారు. ఎప్పుడూ..? 1978. అంటే రామయ్య యుక్త వయసులో ఉండగా అన్నమాట. సతీ సమేతంగా తప్పిపోవడమేమిటి అనుకుంటున్నారా.. అంటే తప్పించేశారన్న మాట. ఎవరూ.. అంతర్జాతీయ స్మగర్లు. ఎలా… మళ్లీ డౌటే. ఇదంతా ఎందుకు కాని… అసలు విషయంలోకి వద్దాం.
తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని ఆనంద మంగళంలో శ్రీ రాజగోపాల స్వామి ఆలయం ఉంది. నాగపట్నం జిల్లాలోనే కాదు… యావత్ తమిళనాడులోనూ ఈ ఆలయానికి విశేషమైన పేరు ఉంది. ఇక్కడి నీల మేఘ శ్యాముడు కోరిన వరాలే కాదు.. కోరుకోకుండా మరచిపోయిన వరాలు కూడా తీర్చేవారట. ఇది కథ కాదు. నిజం అని ఆ ప్రాంతం వారు చెబుతారు.
అంతటి మహిమలున్న అరవింద దళాదాక్షుడ్ని కొందరు సీతా లక్ష్మణ సమేతంగా గుడిలోని తప్పించేశారు. ఎప్పుడంటే 1978 సంవత్సరంలో. 15వ శతాబ్దానికి చెందిన ఈ కాంస్య విగ్రహాల విలువ కోట్లలోనే పలికిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విగ్రహాలు మాయం అయినప్పటి నుంచి ఆనంద మంగళ రాజగోపాల స్వామి గుడికి వచ్చే వారంతా “ రామయ్యా… ఎక్కడున్నావయ్యా… ధరాపుత్రితోడన్… తమ్ముని తోడన్ నడయాడ రావయ్యా“ అని ప్రార్ధనలు చేస్తూనే ఉన్నారట.
భక్తులు ఒకవైపు ఇలా వేడుకుంటూంటే… ఆలయ అధికారులు, తమిళనాడు పురావస్తు శాఖ అధికారులు తమ వంతుగా వెతకడం ప్రారంభించారు. ఎలా అనుకుంటున్నారా.. సీత కోసం ఆంజనేయ స్వామి వెతికినట్లుగా. హనుమంతుడికి సీతమ్మ తల్లి లంకలో రావణ చెరలో దొరికినట్లే తమిళనాడు భక్తాంజనేయ అధికారులకు సీతా లక్ష్మణ సమేత శ్రీరామ చంద్రుల వారు లండన్లో దొరికారు.
దశాబ్దాల ప్రయత్నం ఫలించింది..
లండన్ లో పురావస్తువులు విక్రయించే దుకాణంలో అధికారులు వీటిని కనుగొన్నారు. ”ఈ విగ్రహాలు మావి. మాకిచ్చేయండి“ అంటూ ఆ లండన్ అధికారులను తమిళంలో బతిమిలాడారు. వారు ససేమిరా అన్నారు. ఇలా దశాబ్దాల కాలం గడిచింది. ఆఖరికి ఇలా కాదనుకున్న తమిళనాడు అధికారులు చివరాఖరికి ఇంగ్లీషులోనే వారిని బతిమిలాడి, బామాడి, విగ్రహాలు మావే అనే రుజువులు చూపించారు.
రుజువులు చూశాక అంగీకరించారో… లేక తమిళనాడు వారిని ఇంగ్లీషులో మాట్లాడించామని సంతసించారో కాని లండన్ అధికారులు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి విగ్రహాలను బుధవారం నాడు లండన్ లో ఉన్న భారత హైకమిషన్ కు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న నాగపట్నం జిల్లా అధికారులతో పాటు ఆనంద మంగళంలో శ్రీ రాజగోపాల స్వామి ఆలయం అర్చక స్వాములు, చుట్టుపక్కల భక్తులు “రొంబ” సంతోషించారు. ప్రస్తుతం లండన్ లోన భారత హైకమిషన్ వద్ద ఉన్న మూడు విగ్రహాలు రావణ చెర వీడి అయోథ్య చేరుకున్న సీతలా వారం రోజుల్లో తమిళనాడుకు రానున్నాయి.
ఇక్కడి వచ్చాక ఈ విగ్రహాలకు సంప్రోక్షణలు, హోమాలు, పూజాదికాలు చేసి మళ్లీ పాత ఆలయంలో ప్రతిష్టారట. బాల్యంలో ఇంటి నుంచి తప్పిపోయిన కుమారుడు తిరిగి ప్రయోజకుడై ఇంటికి చేరితే ఎంత సంతోషిస్తారో భక్తులందరూ ఈ విగ్రహాలు వస్తున్నందుకు అంత సంతోషిస్తున్నారట. చివరిగా… రాముడు లోకాభిరాముడు కదా.. అందుకని లండన్ చూసేందుకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేస్తున్నాడు. అంతే.