రేణుకోపాఖ్యానం వింటే జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘పుష్పవిలాపం’ గుర్తుకొస్తోంది. మనిషిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరూ ఊహించలేరు. జీవ హింస మహాపాపం అని తెలిసి శాకాహారులుగా మారిపోతున్న వారు చాలామందే ఉన్నారు. ఈ కోవలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా వచ్చేసినట్టే. ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశం అలాంటిదే. జంతు పరిరక్షణకు సంబంధించి ఓ సంస్థ పోస్ట్ చేసిన దాన్ని ఆమె షేర్ చేయడంతో ఆమెలో వచ్చిన మార్పు ఎలాంటిదో స్పష్టమైంది.
ఒక విధంగా అది ఆమె అభిప్రాయమే అనుకోవాలి కదా. హేపీ హెల్తీ వేగన్ అనే సంస్థ ప్రచారానికి ఆమె తోడ్పాటునందించారు. తను ఎందుకు వేగన్ గా మారిపోయానో ఆమె వివరించారు. ఒక జంతువు జీవిత కాలం మన తాత్కాలిక సుఖ సంతోషాలకు సరిపోదని తేల్చారామె. ఆ జంతువు భయం, బాధ లాంటివాటిని మనం పట్టించుకోకుండా మన 15 నిమిషాల సుఖం కోసం వాటిని బలి చేయడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించింది. అది తనలో ఎంతో మార్పు తెచ్చిందని పేర్కొంది.
ఆ జంతువు ఆహారం రూపంలో మన కడుపులో చేరితే మనకు తాత్కాలికంగా ఆనందం లభించవచ్చేమోగానీ దాని ప్రాణాన్ని తీసేశాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని అన్నారు. వెజిటేరియన్ గా మారితే అందంతో పాటు మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుందని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చెప్పారు. ఆ జాబితాలో ఇప్పుడు రేణూ దేశాయ్ కూడా చేరారని అనుకోవచ్చు.