ఏపీలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే వీకెండ్ కామెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు తరువాత జరిగిన పరిణామాల్లో పోలీసులను రక్షించడం కోసం,వైద్య నివేదికను అనుకూలంగా ఇవ్వవలసిందిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టు తన వద్ద సాక్ష్యాలున్నాయని,ఇందుకు సంబంధించి తనపై,ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై మరో కేసు పెట్టుకోవచ్చని వీకెండ్ కామెంట్లో ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెడతారని బ్లాస్టింగ్ న్యూస్ ప్రచురించిన నేపథ్యంలో కొందరు నాయకులు చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ తన వద్ద తాడేపల్లి రాజకోట రహస్యాలు చాలా ఉన్నాయని,సమయం వచ్చినప్పుడు బయటపెడతానని వ్యాఖ్యానించిన ఆర్కే..తాజాగా రఘురామకృష్ణంరాజును హింసించారని,ఆ విషయం బయటకు రాకుండా ఉండేలా ఆసుపత్రి వైద్యులపై ఒత్తిడి తెచ్చారన్న ఆధారాలున్నాయన్నారు.
జగన్ ప్రభుత్వానికి పలు హెచ్చరికలు..
జాలిపడదామనే లీడ్తో మొదలైన వీకెండ్ కామెంట్లో జగన్ ప్రభుత్వానికి పలు హెచ్చరికలు జారీ చేశారు.తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదని హెచ్చరిస్తూనే పలు అంశాలపై నిలదీశారు.సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో పాటు రఘురామకృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయన్నారు.మీడియాకు బెదిరింపులు,న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయకపోవడం,SECగా ఉన్న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోలేకపోయారంటే SEC పదవికి ఆమె అర్హురాలేనా అన్న సందేహం కలుగుతోందని హైకోర్టు ఆక్షేపించడం,ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నర్మగర్భంగా చురకలు అంటించడానికి కారణమేంటనే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారు.
మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటూ..
ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నాయనే వాదన ఉన్న తరుణంలో సుప్రీంకోర్టు ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజుకు వైద్యపరీక్షలకు ఆదేశించిందని,పోలీసుల దురుసు ప్రవర్తన విషయం బయటపడిందని చివరికి ఈ విషయంలోనూ జగన్ అండ్ కో మసిపూసి మారేడుకాయ చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజుకు బెయిలు వచ్చిందన్న విషయంతో పాటు రఘురామకృష్ణంరాజు కాళ్లకు గాయాలున్నాయని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇవ్వడాన్ని మరుగున పర్చి ఈ కేసు విషయంలో మీడియాతో మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు చెప్పిందంటూ.. జగన్ సొంత మీడియా హైలైట్ చేసిందని,ఇదే జర్నలిజమా అని ప్రశ్నించారు. ఈ కోణంలో జగన్ మీడియాను నీలి మీడియా అనొచ్చా అని ప్రశ్నించారు.
తటస్థవాదులపైనా కామెంట్లు
గతంలోనూ ఎన్నడూ లేని విధంగా ఈ సారి కొందరి పేర్లను కూడా ఆర్కే ప్రస్తావించారు.తటస్థవాదులుగా చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు కూడా రఘురామకృష్ణంరాజు విషయంలో సుప్రీంకోర్టు షరతుల కోణంలో జగన్ కోరుకున్నదే జరిగిందని వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు.విచారణలో ఉన్న కేసు విషయంలో మాత్రమే ఆ షరతులు వర్తిస్తాయన్న ఆర్కే దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేసే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.జగన్ రెడ్డికి గతంలో బెయిలు మంజూరు చేసినప్పుడు కూడా కోర్టు షరతులు విధించిన విషయాన్ని గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు విషయంలో ప్రభుత్వం చేసిన వాదనలన్నీ వీగినట్టే కనిపిస్తున్నా రఘురామకృష్ణంరాజుపై తామే పైచేయి సాధించామనే పోకడలపై దుమ్మెత్తి పోశారు.కాగా రఘురామకృష్ణంరాజుపై నమోదు చేసిన రాజద్రోహం కేసులో ‘ఏబీఎన్ చానల్’తో పాటు TV5 ఛానెల్ ని కూడా కుట్రదారులుగా చేర్చిన అంశంపై ప్రొ.నాగేశ్వర్ అవి టీడీపీ ఛానెళ్లని వాఖ్యానించడంపై కౌంటర్ ఇచ్చారు.తాము ముఖ్యమంత్రి జగన్రెడ్డి విధానాలను విమర్శిస్తున్న మాట వాస్తవమేనని, జగన్ ప్రభుత్వ తీసుకుంటున్ననిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నందునే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు.సీపీఎం సానుభూతిపరుడైన నాగేశ్వర్ తటస్థవాది ఎలా అవుతారని ప్రశ్నిస్తూనే తమను ఆయన నిందించినట్టుగా తాము కూడా ప్రొ.నాగేశ్వర్ జగన్ పక్షపాతి అంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మేధావులుగా చెప్పుకుంటున్న కొందరు జగన్ చేస్తున్నదుష్ప్రచారానికి వంతపాడడం ఏంటని ప్రశ్నించారు.వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపితే గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది ఎవరని ప్రశ్నించారు.
Must Read ;- ‘మేం చెప్పిందే చట్టం.. చేసేదే న్యాయం’..!
ముందుంది ముసళ్లపండగ
కాగా రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ప్రభుత్వ ఆసుపత్రి నివేదిక బయటకు వచ్చాక పోలీసులు కొట్టలేదని ప్రచారం చేశారని,చివరికి ఆర్మీ ఆసుపత్రి నివేదిక వచ్చాక రఘురామకృష్ణంరాజుకి ఎడిమా వ్యాధి ఉందని ప్రచారం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు.లాఠీలతో కొడితే సొరియాసిస్ వస్తుందని చెప్పగల తెంపరితనం జగన్ అండ్ కో సొంతమని ఎద్దేవా చేశారు.కాగా రఘురామకృష్ణంరాజు కేసు ఇక ముగిసినట్టేనని చాలామంది అభిప్రాయ పడుతున్నారని, అయితే ముందుంది ముసళ్లపండగ అని వ్యాఖ్యానించారు.రఘురామకృష్ణంరాజుని హింసించిన వారెవరో నిర్ధారించాలని, శిక్షపడేలా చేయాలని సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వస్తుందని చెప్పారు.రఘురామకృష్ణంరాజు విషయంలో పలు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు ఉన్నందున ఈ విషయంలో తప్పుచేసిన వారెవరూ తప్పించుకోలేరని చెప్పిన ఆర్కే మరో సంచలన వ్యాఖ్య చేశారు. రఘురామకృష్ణంరాజు కేసులో ఏ స్థాయిలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని,అయితే రఘురామకృష్ణంరాజుపై దాడి చేసిన పోలీసులను రక్షించడం కోసం,వైద్య నివేదికను అనుకూలంగా ఇవ్వవలసిందిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని,అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని,తన మీద గానీ,‘ఏబీఎన్’ మీద గానీ ఇంకో కేసు పెట్టుకోవచ్చని సవాలు విసిరారు.వీటితోపాటు రాజద్రోహం కేసు,సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు స్వీకారం,అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ రఘురామకృష్ణంరాజుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు,జోగిరమేష్కు సీఎం జగన్ ప్రోత్సాహం,టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుని ఉద్దేశించి వైసీపీ చేసిన కామెంట్లు,గతంలో కేవీపీ అమెరికాలో ఓ కేసులో ఇరుక్కున్న సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఉదాహరించారు.కస్టడీలో రఘురామకృష్ణంరాజు పట్ల పోలీసుల ప్రవర్తనపై విచారణ జరిగితే అత్యుత్సాహం ప్రదర్శించిన సీఐడీ అధికారులకు మూడినట్టేనని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి గెలిచి రఘురామకృష్ణంరాజు జగన్ విమర్శించడాన్ని తప్పుబట్టేవారు టీడీపీ నుంచి గెలిచి చంద్రబాబుని తిట్టే వంశీని ఎందుకు సమర్థిస్తున్నట్లని ప్రశ్నించారు.అదే సమయంలో రఘురామరాజు అత్యున్నత విలువలు కలిగిన సంఘ సంస్కర్తేమీ కాదని,ముఖ్యమంత్రి జగన్రెడ్డి కూడా అంతేనని చురకలంటించారు.
పరిధులు దాటి వ్యవహిరిస్తే..
అధికారం చేతిలో ఉంది కదా అని పరిధులు దాటి వ్యవహిరించేవారు శిక్ష అనుభవిస్తారని చెబుతూ ఎమర్జెన్సీ టైంలో అధికార పార్టీకి వత్తాసు పలికిన కొందరు అధికారులు ఆ తరువాత వచ్చిన ప్రభుత్వ ఏర్పాటు చేసిన షా కమిషన్ విచారణలో దోషులుగా తేలి శిక్ష అనుభవించిన చరిత్రను మరచిపోకూడదని వ్యాఖ్యానించారు.గతంలో చేసిన వీకెండ్ కామెంట్లోనూ ఇలాంటి అంశాన్నే ప్రస్తావించారు.గతంలో వామపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై అత్యంత పాశవికంగా దాడులు జరిగాయని,తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార చర్యలు మొదలయ్యాయని,వామపక్షాలు కనుమరుగయ్యాయన్నారు.ప్రతీకార,కక్ష సాధింపు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని,అలాంటి పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించారు. తమిళనాడులో కరుణానిధి,జయలలిత హయాంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదని, అయితే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితి వేరని వ్యాఖ్యానించారు.కరుణానిధి వారసుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించాలని నిర్ణయించడంతో పాటు ప్రతిపక్ష నాయకుడు పన్నీర్ సెల్వం నివాసానికి వెళ్లి ఆయనను కలవడం ద్వారా సరికొత్త సంప్రదాయానికి తెరతీశారని,నాయకుల ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇలాంటి చర్యలు చాటిచెప్పుతాయన్నారు.సజ్జల చెబుతున్న రాజనీతిజ్ఞుడైన జగన్రెడ్డిలో ఈ లక్షణాలు ఒక్కటైనా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.
Also Read ;- మీడియాపై రాజద్రోహమా?.. సుప్రీంకు టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లు