ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాల్సిన తప్పనిసరి పరిస్థితి తలెత్తింది. ఉద్యోగసంఘాలు కూడా కొంత వెనక్కి తగ్గాయి. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో భాగంగా చర్యలను వేగిరం చేసింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ల అభిశంసనకు సిఫారసు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల చేసిన కొన్ని వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అందులో రెండు ఇష్యూలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటిది పార్టీ గుర్తులు ఉండవు అనే అంశం కాగా రెండోది ఏకగ్రీవాలకు సంబంధించిన అంశం.
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. ఆయా పంచాయతీల్లో వచ్చిన నామినేషన్లను బట్టి ప్రాథమిక గుర్తులను కేటాయిస్తారు. వాటిపై అభ్యర్థులు ప్రచారం చేస్తారు. ఈ విషయమే రాజకీయ పార్టీల మధ్య రచ్చకు కారణం అవుతుంది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నందున సాధారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, యంత్రాంగం పర్యవేక్షణతోపాటు నిధుల కేటాయింపు ఉంటుందని ప్రచారం చేయడం కామన్. చాలావరకు గ్రామాల్లో ఆయా పార్టీల మద్దతుదారులే అభ్యర్థులుగా ఉంటారు. పార్టీలు గుర్తులు మాత్రమే ఉండవు. మిగతా ఆధిపత్యపోరు, పంపిణీలు, హామీలు ఇవన్నీ సాధారణ ఎన్నికల తరహాలోనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లోనూ సజ్జల మాట్లాడుతూ ఇవి పార్టీ రహిత ఎన్నికలని, పార్టీలు ప్రతిష్టగా తీసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా సహకరించాలని వ్యాఖ్యానించారు.
Must Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!
సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే కాదు.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సకూడా అదే మాట్లాడుతున్నారు. ఓవైపు పార్టీల రహితంగా జరుగుతున్న ఎన్నికలు అని చెబుతూనే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లోనై వైసీపీ రంగు గట్టిగా పులుముతున్నారనే కామెంట్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఇక్కడే మరో విషయం కూడా పంచాయతీ ఎన్నికల్లో సహజంగా కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థులు తమవారంటే.. తమవారని కూడా పార్టీలు తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇక ఇప్పటికే ప్రతిపక్షాలు పంచాయతీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేదని విమర్శిస్తున్న నేపథ్యంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి
ఇక ఏకగ్రీవాల విషయానికి వస్తే.. ఏకగ్రీవాలకు ప్రభుత్వంనుంచి ప్రోత్సాహకాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. భవిష్యత్తుల్లోనూ ఉంటాయి. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను పెంచడం కూడా జరుగుతుంది. ప్రతి ఐదేళ్లకు ఓసారి జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఎన్నికల ఖర్చు తగ్గడంతోపాటు.. గ్రామంలో అంతా ఒకటే మాటమీద ఉండడం ద్వారా ప్రగతికి అవకాశం ఉంటుందనేది ముఖ్యమైన కారణం. ఇదే విషయంపై సజ్జల మాట్లాడుతూ ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూనే.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలుంటాయని, అనర్హత వేటుకూడా ఉంటుందని పలుమార్లు వ్యాఖ్యానించారు.
పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో బలబలాలు తెలుస్తాయని వైసీసీ నేతలు కూడా అవే తరహా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఓవైపు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తున్నా.. పరోక్షంగా ఓ హెచ్చరికగా భావించవచ్చని కామెంట్లూ వస్తున్నాయి. పార్టీ రహితంగా అంటూనే.. పార్టీతో హడావుడి చేయడం, ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూ ఏకగ్రీవాలకు రూ.10లక్షలనుంచి రూ.20లక్షలకు పెంచిన ప్రభుత్వం అదే సమయంలో పరోక్ష హెచ్చరికలు చేయడం వెనుక అర్థం ఏంటనే ప్రశ్న ప్రతిపక్షాలనుంచి వస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలవడం కన్నాఏకగ్రీవం చేసుకోవడానికే అధికారపార్టీ ప్రాధాన్యం ఇస్తోందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని విపక్షం ఆరోపిస్తోంది.
Also Read ;- నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల