ఓ కలం కలకలం రేపుతోంది.. ఆ కలం నుంచి జాలువారిన పదాలు జనజీవన స్రవంతిలో పెదాలపై ఆడుతున్నాయి. ఆ ఒకే ఒక్క పాట.. ఎంతగా వైరల్ అవుతోందంటే రాయడానికి మాటలు చాలవు.
ఎందరికో స్ఫూర్తినిస్తోంది ఈ పాట. ఎవరో ఒకరు రాసిన ఈ పాట నేడు ఎందరి నోళ్ల నుంచో పలుకుతోంది. ఆ పాటే ‘కాలం నీతో నడవదు’. ఆ పాటలో రాసినట్టుగానే కాలం మనతో నడవడం లేదు.. మనల్ని అడిగి ముందుకు సాగడం లేదు. కాలంతో పాటు మనం ముందుకు సాగడమే. మనలో సంకల్పం ఉంటే అదొక్కటే చాలదు.. దానికి సమయమే సరైన ఆయుధం. అంటే మళ్ళీ కాలనికే రచయిత ప్రాధాన్యం ఇచ్చాడు. మన లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణమూ విలువైనదని తెలుసుకోమని కూడా అంటాడు రచయిత.
కాలానికి ఉన్నాడో లేనోడూ అని ఉండదని, మంచోడో చెడ్డోడూ అని ఉండదంటాడు. కులాలూ మతాలూ కాలానికి ఉండవట. ‘ప్రేమ జాలీ చూపదు.. దయాదాక్షిణ్యాలే ఉండవు.. దానికి విలువ ఇస్తే గెలుస్తవు.. అది మరచిపోతే అక్కడే ఆగుతవు’ అంటూ కాలం చేతిలో మనం కీలు బొమ్మలం అనే నగ్నసత్యాన్ని ఈ పాట చెబుతుంది.ఇక రెండో చరణంలోకి వెళ్లి చూద్దాం. ‘మనకున్న టైం సరిపోదు జర జల్దీ మేలుకోరో.. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే..
క్రమ పద్ధతి లేని జీవనం.. కాలం విలువను మరచిన సమయాభావం తప్పని, అది లేదని చెపితే కుదరదే, గెలిచిన వీరుని మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకుని ముందుకుపోతే విజయం నీ బానిసరా’ అని చెప్పడంలో రచయిత ఉద్ధేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాలం విలువ తెలియాలంటే విజయం సాధించిన ఎవరిని అడిగినా వారి నుంచి అదే సమాధానం వస్తుందని రచయిత చెప్పాడు. మూడో చరణాన్ని కూడా ఓసారి చూద్దాం.
‘ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్నీ, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించీ, నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా.. విలువలతోనే బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణ ను నేర్పిస్తది రా సమయం అనునిత్యం.. స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం.. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం’ అంటూ కాలం విలువ అనంతమైనదన్న నగ్న సత్యాన్ని విప్పి చెప్పాడు. నిన్ను నిన్నుగా మలిచే ఉలి కాలమేనని రచయిత చెప్పగలిగాడంటే అతనిలో ఎంత లోతైన భావుకుడు ఉన్నాడో మనకు అర్థమవుతుంది.
ఈ యువతి గళంతో ఆ పాటను మనం విందామా..
ఇంతకుముందు సుద్దాల అశోక్ తేజ రాసిన ‘ఒకటే జననం ఒకటే మరణం’ పాట లాగానే ఇంతటి స్ఫూర్తిమంతమైన ఈ పాట సినిమా నుంచి రాకపోయినా జనంలోకి వెళ్లిపోయింది. ఈ పాటను కూడా కాలమే ముందుకు తీసుకుపోతోంది. పాట గురించి మనం తెలుసుకున్నాం.. దీన్ని రాసిన రచయిత గురించి కూడా తెలుసుకోవాలిగా. అతని పేరు ప్రసాద్ మానుకోట అని తెలిసింది. స్వేరోస్ స్వర సునామిలో ఈ పాటను రాశనని, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఈ పాటను రాయించారని ప్రసాద్ అంటున్నారు. రవి కళ్యాణ్ స్వరకల్పనలో, హైమత్ గళంతో ఈ పాట జనంలోకి వెళ్లిపోయింది. ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఓ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ పాట 5 మిలియన్ల వ్యూస్ సాధించేసింది.
హైమత్ పాడిన ఈ పాటను శైలజా భట్టు అనే యువతి ఎంత చక్కగా పాడిందో ఇక్కడ చూడండి. పాటలో లీనమై అంతగా హావభావాలను ఆమె పలికించింది. రాతరాసి ఉండాలి.. గీతరాసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా లభిస్తుంది. వయసులో ఉన్నపుడు కష్టపడటానికి సిగ్గుపడితే.. వయసు దాటాక అందరిముందూ బతకటానికి కూడా సిగ్గుపడాల్సి వస్తుంది.. అందుకే సమయం విలువ తెలుసుకుని అందరూ మసలుకుంటే మంచిది. కాలం విలువ తెలుసుకుంటే కలకాలం మనం బతుకుతాం.
ఎవరీ పాట పాడిన శైలజ
వాట్సాప్ లో శైలజ పాడిన పాట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె వివరాలు కూడా తెలిశాయి. ఆమె పేరు శైలజా భట్టు అని, ఆమెది వరంగల్ సమీపంలోని చింతనెక్కండ అనే ఊరని తెలిసింది. రచయితది కూడా ఆ పక్క ఊరే. అతనికి మెహబూబాబాద్. చాలామంది ఆ అమ్మాయే ఈ పాట రాసిందని కూడా అనుకున్నారు. తనకు ఈ పాట బాగా నచ్చి ఆమె పాడిందట. రచయిత మానుకోట ప్రసాద్ కు చిన్నప్పటి నుంచి పాటలు రాయడమంటే మక్కువ. ఆ ప్రయత్నాల్లో ఉంటూనే ‘వేకువ’ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో తన పాటలు పాడించి పెట్టుకుంటున్నారు. తనకు ఆ పాట నచ్చి పాడానని, అదలా వైరల్ అయ్యిందని ఆమె వివరించింది.
– హేమసుందర్ పామర్తి