ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. 2019లో డిసెంబరు 26 నుంచి 28 వరకూ ఈ షష్ఠ గ్రహ కూటమి వచ్చాకే కరోనా ప్రబలిందని వార్తలు కూడా వచ్చాయి. దీనికి జ్యోతిష పరమైన విశ్లేషణను కొందరు జ్యోతిష పండితులు కూడా అందించారు. మరోసారి ఇలాంటి గ్రహ కలయిక జరగబోతోంది. అది మరెంతో దూరంలో లేదు. వచ్చే ఫిబ్రవరిలో 10 తేదీ నుంచి 12వ తేదీ వరకూ షష్ఠ గ్రహ కూటమి ఏర్పడబోతోంది.
2019లో షష్ఠ గ్రహ కూటమి ఏర్పడి నప్పుడు కాలసర్ప దోషం ఉంది. అంటే అన్ని గ్రహాలూ రాహుకేతువు మధ్య బందీ అవడం. ఈసారి కూడా అలానే జరగబోతోంది. ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడటం అరుదైన విషయమే అయినా దీనికి వైరస్ పుట్టుకకూ ఏదైనా సంబంధం ఉందా లేదా అనేది శాస్త్రానికి సంబంధించిన విషయం. ఇక్కడే జ్యోతిష్యానికీ సైన్సుకూ పొసగదు. ఆరు గ్రహాలు మాత్రమే కాదు మనకున్న నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1962లో ఇలాంటి అష్ట గ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు ఎలాంటి ఉపద్రవాలూ తలెత్తలేదు.
గత ఏడాది డిసెంబరులో ధనుస్సు రాశిలో శని, కేతువు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిశాయి. కచ్చితంగా అదే సమయంలోనే వైరస్ ప్రబలడం మొదలైంది. వచ్చే ఫిబ్రవరిలో మకర రాశిలో రవి, బుధ, గురు, శుక్ర, శని, చంద్రులు కలుస్తున్నారు. కాకపోతే అప్పుడు ఆయా గ్రహాలతో కేతువు కలిసి ఉన్నాడు.. ఈసారి రాహుకేతువులు ఈ ఆరు గ్రహాలకూ దూరంగా ఉన్నాయి. ఈసారి వచ్చే షష్ఠ గ్రహ కూటమికి భయపడాల్సిన పనేమీ లేదని జ్యోతిష పండితులు అంటున్నారు. ఈసారి వ్యాక్సిన్ ను ఈ గ్రహ కూటమి తెచ్చిందనుకుని పాజిటివ్ థింకింగ్ తో ఉండటం మంచిది.