వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్ స్కామ్లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మద్యం కంపెనీల నుంచి అందిన ముడుపులను ఇతని కంపెనీల ద్వారా డైవర్ట్ చేశారని సిట్ అధికారులు భావిస్తున్నారు. నర్రెడ్డి సునీల్ రెడ్డి అరడజను కంపెనీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలోని ఇతని ఆఫీసుల్లో సిట్ గతంలో తనిఖీలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సునీల్రెడ్డి ఇచ్చే సమాధానాల ద్వారా.. ఈ కేసులో అసలు లబ్దిదారులతో లింకు దొరికే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్లో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి.. అప్పట్లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డిలను విచారించిన సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఏ కంపెనీల నుంచి లంచాలు అందాయి.. వాటిని ఏ రూపంలో ఎక్కడికి తరలించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తూనే మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొంది. నేరుగా రాష్ట్ర సర్కారే వైన్స్ షాపులను నిర్వహించింది. పాపులర్ బ్రాండ్ మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి.. నాసిరకం జే బ్రాండ్ లిక్కర్ని రెండు, మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్మిన విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఈ నాసిరకం బ్రాండ్ లిక్కర్ని అమ్మడం వెనుక 3 వేల 200 కోట్ల స్కామ్ ఉందని సిట్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కుంభకోణంలో ఎవరికి ఎంత వాటా వెళ్లింది.. అసలు కింగ్పిన్ ఎవరో కనిపెట్టడానికి అధికారులు పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. నర్రెడ్డి సునీల్రెడ్డి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా.. కీలక వ్యక్తుల పాత్ర బయటపడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది











