హీరోగా సాయిధరమ్ తేజ్ కు సోలో విడుదలే సో బెటరేమో. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. దసరాకి ‘సోలో బతుకే సో బెటర్’ ఓటీటీ విడులకు సిద్ధమైపోయింది. జీ ప్లెక్స్ లో పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయిధరమ్ సరసన నభా నటేష్ నటించింది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. శ్రీవేంకేటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలకు సంబంధించిన తాజా సమాచారం ఏమిటంటే దీన్ని ఓటీటీలో విడుదల చేయటానికి నిర్ణయం జరిగింది.
కాకపోతే పే పర్ వ్యూ పద్ధతిలో ఈ విడుదల ఉంటుంది. ఈ నెల 15 నుంచి థియేటర్లు ప్రారంభమైతే పరిస్థితి ఏమిటన్నది తేలాల్సి ఉంది. ఈ కొత్త పద్ధతి ఓటీటీకి వరమనే చెప్పాలి. నష్టపోయేది మాత్రం చందాదారులే. ఏదైనా సినిమా చూడాలంటే సినిమాని బట్టి ధర నిర్ణయిస్తారు. ఆన్ లైన్ లో ఆ మొత్తం చెల్లించగానే ఓటీటీ పంపే కోడ్ ద్వారా ఆ సినిమాని చూడాల్సి ఉంటుంది. ఓ కోడ్ కూడా మూడు గంటల వ్యవధిలో ముగుస్తుందట. ఆ తర్వాత చూడాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సిందే. ఇప్పడు ఉన్న విధానం కన్నా ఇది నిర్మాతలకు కూడా ప్రయోజనకరంగా అనిపిస్తోంది. పైగా పైరసీ సమస్య లేకుండా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
మనకు తెలుస్తున్న సమాచారం బట్టి ఈ పద్ధతిలో విడుదలయ్యే తెలుగు సినిమా ‘సోలో బతుకే సో బెటర్’ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి థియేటర్, శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకున్నట్లు తెలిసింది. కరోనా రాకుంటే మే 1 ఈ సినిమా విడుదల చేయాల్సి ఉంది. పే పర్ వ్యూ పద్ధతిలో ఈరోజు రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి. విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేష్ నటించిన తమిళ చిత్రం క.పే. రణసింగం, హిందీ సినిమా ఖాలీ పేలీ కూడా ఈ గాంధీ జయంతి రోజున విడుదలయ్యాయి. వీటికి 199 నుంచి 299 వరకూ ధర నిర్ణయించారు. మరి ‘సోలో బతుకే సో బెటర్’ కు ఎంత ధర నిర్ణయిస్తారో చూడాలి.