వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు షాక్ తగిలింది. ఆయన డిగ్రీ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టనున్నారు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన తమ్మినేని నకిలీ డిగ్రీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు.
తమ్మినేని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆరోపించారు. తన ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని..అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లో రెండో ఏడాదితోనే డిగ్రీ ఆపేసినట్లు తమ్మినేని పేర్కొన్నట్లు ఎమ్మెల్యే కూన ఆరోపిస్తున్నారు. డిగ్రీ పాస్ కాకుండానే లా కోర్సులో ఎలా చేరారని కూన ప్రశ్నిస్తున్నారు.