తెలుగు తమ్ముళ్లు ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్టేట్ కమిటీ పదవులు ప్రకటించారు. బీసీలు, ఎస్సీలు, యువనేతలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేశారు. 18 మందిని టీడీపీ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరిలో నిమ్మల కిష్టప్ప, పత్తిపాటి పుల్లారావు, వై.వి.బి.రాజేంద్రప్రసాద్ లను ఉపాధ్యక్ష పదవి వరిచింది. వీరితోపాటు మరో 15 మందిని కూడా టీడీపీ ఉపాధ్యక్షులుగా నియమించారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులను పార్టీ ఉపాధ్యక్ష పదవులు వరించాయి. పార్టీలో 30 సంవత్సరాలుగా నమ్మకంతో పనిచేస్తున్న వారిని పార్టీ ఉపాధ్యక్షులు నియమించారు.
పార్టీలో కీలకం ప్రధాన కార్యదర్శులే…
టీడీపీ సీనియర్ నేతలను పార్టీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. మొత్తం 16 మందిని టీడీపీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తో పాటు, ఎస్సీ నేత మద్దిపాటి వెంకటరాజును ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. వీరుకాక మరో 13 మందిని ప్రధాన కార్యదర్శులుగా తీసుకున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో టీడీపీ కీలక నేత దేవినేని ఉమామహేశ్వరావును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఉమకు గిరి గీశారు
మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యవహార శైలివల్లే కృష్ణా జిల్లాలో టీడీపీ దారుణంగా నష్టపోయిందనే ప్రచారం ఉంది. దేవినేని ఉమను ఆయన నియోజకవర్గానికే పరిమితం చేస్తేనే కృష్ణా జిల్లాలో టీడీపీ బతికి బట్టకడుతుందని కొందరు టీడీపీ జిల్లా నేతలు టీడీపీ అధినేతకు విన్నవించారట. అందుకే దేవినేని ఉమకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి, పార్టీ అధినేత ఉమకు చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. దేవినేని ఉమ అతి రాజకీయాలకు టీడీపీ అధినేత బ్రేక్ వేశారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కృష్ణా జిల్లా టీడీపీలో ఫైర్ బ్రాండ్ పంచుమర్తి అనురాధకు ప్రమోషన్ లభించిందనే చెప్పవచ్చు. పార్టీ అధికార ప్రతినిధి నుంచి ప్రమోషన్ ఇచ్చి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీంతో బీసీ మహిళలకు కూడా పార్టీ పెద్ద పీట వేసినట్టయింది. టీడీపీలో కీలకంగా పనిచేస్తున్న మరో ఎస్సీ నేతకు రెండు పదవులు వరించాయి. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన మద్దిపాటి వెంకటరాజు పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ఆ యువ ఎస్సీనేతకు పార్టీ ప్రధాన కార్యదర్శితోపాటు, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఇంఛార్జిగా నియమించారు.
అధికార ప్రతినిధులెవరంటే?
టీడీపీ అధికార ప్రతినిధులుగా 18 మందికి అవకాశం దక్కింది. వీరిలో పరిటాల శ్రీరామ్, గౌనివారి శ్రీనివాసులు ఉన్నారు. వీరితోపాటు మరో 16 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. అనంతపురం జిల్లాలో పరిటాల రవి కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంది. పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే శ్రీరామ్ ను కేవలం అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆయన అభిమానులు కొంత అసంతృప్తికి లోనయ్యారనే తెలుస్తోంది. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 59 మందికి, పార్టీ కార్యదర్శులుగా 108 మందికి అవకాశం కల్పించారు. తిరుపతికి చెందిన ప్రముఖ సైకాలజిస్టు, రాజకీయ విశ్లేషకులు ఎన్.బి. సుధాకర రెడ్డిని కూడా అధికార ప్రతినిధిగా నియమించారు. ప్రభుత్వ వైఫల్యాలపై తిరుగులేని రీతిలో, జంకకుండా గళమెత్తగల వారినే అధికార ప్రతినిధులుగా నియమించినట్లు కనిపిస్తోంది.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా నల్లారి!
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా టీడీపీ ప్రకటించిన పదవుల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఒక రకంగా కిషోర్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ లభించిందనే చెప్పాలి.