ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఏపీలో కరెంట్, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారన్నారు. అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు.
హైదరాబాద్లో మతకల్లోలం లేదన్న ఆయన, రాష్ట్రానికి ఏం తేవాలో ప్రతిపక్షానికి అవసరం లేదన్నారు. కేవలం సీఎం కేసీఆర్ను తిట్టడంలోనే ప్రతిపక్షం పీజీ చేసిందని, పనికిమాలిన విమర్శలు చేయడంలో ప్రతిపక్షాలను మించినవారు ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప ప్రతిపక్షాలకు ఏమీ తెలియదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అదేసమయంలో తెలంగాణలో జీవో నెంబర్ 111 ని కూడా ఎత్తివేస్తామని.. 2014లోనే సీఎం కేసీఆర్ ఈ అంశంపై హామీ ఇచ్చారని మంత్రి కేటీఆర్ తెలిపారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం చూస్తుందని, రాబోయే పదేళ్ల వరకు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదని కేటీఆర్ పేర్కొన్నారు.