దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15 నాడు వస్తే….హైదరాబాద్ సంస్థానానికి (ఇప్పటి తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాలు) మాత్రం 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ఎందుకంటే 1947 ఆగస్టు 15 దేశమంతా స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో సంబరాలు జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిరంకుశ నిజాం ఉక్కు పిడికిట్లోనే ఆగస్టు 15 తరువాత కూడా బందీగా ఉండిపోయింది.
నిజాం రజాకార్ల రాక్షసకృత్యాలను అంతమొందించే వీర తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది బలిదానాలు చేసిన తర్వాతే భారత ప్రభుత్వం పోలీసు చర్యకు పూనుకుంది. తత్ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్య్రం లభించింది. ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహించలేకపోవడం, ఈ అంశాన్ని పాఠ్యాంశాలలో చేర్చకపోవడం వల్ల సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత ఇప్పటి తరాలకు తెలియడం లేదనే అంశాన్ని అప్పటి ఉద్యమకారులు, బిజెపి పార్టీ వర్గాలు ప్రధానంగా లేవనెత్తుతున్నాయి.
దేశంలో అధికారంలో ఉన్న బిజెపి తలుచుకుంటే సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్వహించడం అంత పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని మిగతా పార్టీ నాయకులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఏడాదంతా ఏమీపట్టనట్లుగా ఉండి కేవలం సెప్టెంబర్ 17వ తేదీకు కొద్ది రోజుల ముందు మాత్రమే అధికారికంగా విమోచన దినాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకొస్తున్నారనే విమర్శ ఉంది.
బిజెపి పార్టీ తలుచుకుంటే కాశ్మీర్ అంశం తరహాలోనే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకోవచ్చనే ప్రశ్నలను ఇతర రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్నాయి. అలాకాకుండా బిజెపి….సెప్టెంబర్ 17 నాడు విమోచన దినాన్ని నిర్వహించాలని కేవలం ప్రకటనలకే పరిమితమైందంటున్నారు. ఈ సున్నితమైన అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని అది రాష్ట్ర ప్రభుత్వం పాటించేలా అధికారిక చర్య తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం టిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోనే పెట్టాలనే ధోరణీలో బిజెపి వ్యవహరిస్తుందని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విమోచన దినం నిర్వహించాలనే దానిపై బిజెపికి చిత్తశుద్ధి లేదని టిఆర్ఎస్ విమర్శిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశంపై ఎటూ తేల్చ కుండా నాన్చుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17 ని తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు చేస్తామని బెజెపి కొన్నేళ్లుగా చెప్పుకుంటూ వస్తుంది.
కానీ ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడి ఇక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలను రాష్ట్ర నాయకత్ం అంతగా చేయలేదనే చెప్పాలి. అవకాశం దొరికినప్పుడల్లా తమ మైలేజీని పెంచుకునేందుకు బిజెపి ఈ నినాదాన్ని తమ భుజాలపై ఎత్తుకుని రాజకీయం చేయడం తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని ఇతర పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి.