ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో పట్టాలెక్కనున్న మూడో సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు .. ఇప్పటికీ అవి టీవీల్లో సాధిస్తున్న రేటింగులు అందుకు కారణం. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ పేరు వినిపించగానే అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఏ తరహాలో ఉండనుందనే కుతూహలం అభిమానుల్లో అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
మహేశ్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన ‘అతడు’ ఇద్దరు కెరియర్లోను చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. అంతకుమించిన యాక్షన్ ఎపిసోడ్స్ తాజా సినిమాలో ఉంటాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ యాక్షన్ చుట్టూ త్రివిక్రమ్ మార్కు ఎమోషన్లు .. కామెడీ ఉండనే ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమాకి తన సంగీతం హైలైట్ గా నిలపాలనే ఉద్దేశంతో తమన్ ఉన్నాడని అంటున్నారు.
ఈ సినిమాలో మహేశ్ జోడీగా పూజ హెగ్డేను తీసుకోనున్నారనగానే ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ‘మహర్షి’లో వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్ లో వర్కౌట్ కావడమే అందుకు కారణం. ఆమెనే ఎంపిక చేసినట్టుగా నిన్న అధికారిక ప్రకటన రావడంతో, హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘మహర్షి’ తరువాత మహేశ్ బాబుతో, ‘అరవింద సమేత’ .. ‘అల వైకుంఠపురములో’ తరువాత త్రివిక్రమ్ తో కలిసి పూజ చేస్తున్న సినిమా ఇది. ఈ ముగ్గురూ కలిసి బాక్సాఫీస్ కి బ్లాక్ బస్టర్ ను అప్పగించేస్తారేమో చూడాలి మరి.