హైదరాబాద్ మేయర్ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పదవి కోసం ఆశావహుల ప్రయత్నాలు తీవ్రం అయ్యాయి. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 గెలిచాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకున్నా..టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతోపాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా టీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నందున మేయర్ సీటు కూడా ఆ పార్టీ దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్లో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అయితే, కౌన్సిల్ సమావేశాలు గతంలో జరిగినంత ప్రశాంతంగా జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఢీకొట్టే చాతుర్యం, చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు క్లీన్ ఇమేజ్ తెచ్చుకుని పార్టీ విస్తరణకు ఉపయోగపడే వారిని మేయర్గా చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజున కోరం ఉంటే అప్పటికప్పుడు కౌన్సిల్లో ఎవరికి సభ్యుల మద్దతు ఎక్కువగా ఉంటే వారిని మేయర్గా ఎంపిక చేస్తారు.
రేసులో వీరు..
- ఈ సారి జీహెచ్ఎంసీ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. రేసులో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పీజేఆర్కు ఉన్న క్రెడిబిలిటీ, టీఆర్ఎస్లో విజయారెడ్డికి ఉన్న మద్దతు, రెండోసారి గెలవడం అంశాలు సానుకలంగా ఉన్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆమె మేయర్ కావడానికి ప్రయత్నించారు. అప్పట్లో పార్టీ నుంచి వచ్చిన హామీ మేరకు వెనక్కి తగ్గారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటు అడిగినా పార్టీ దానం నగేందర్కు కేటాయించింది. దీంతో ఎలాగైన ఈ సారి మేయర్ వస్తుందనే ఆశతో ఉన్నారు విజయారెడ్డి. అయితే ద్వితీయశ్రేణి నాయకుల అండ లేకపోవడం కొంత మైనస్ పాయింట్గా మారింది.
- భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా పేరున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి కోడలు సింధూరెడ్డి. పార్టీకి విధేయతగా ఉండడం, ఉన్నత విద్యావంతురాలు కావడం ప్లస్ పాయింట్లు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడిన కాసేపటికే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సింధూ ఆదర్శ్రెడ్డికే మేయర్ పీఠం అని ప్రచారం జరిగింది. కాని..నగర కోర్ ఏరియాను కాదని శివారు ప్రాంత కార్పొరేటర్లకు ఇస్తే ప్రతికూల ప్రచారం జరుగుతుందనే చర్చ కూడా నడుస్తోంది.
- టీఆర్ఎస్లో కీలకనేత, పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు కే.కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇటీవలే కొన్ని వివాదాలు తలెత్తడంతో పాటు గతంలో కొన్ని విమర్శలు ఉండడం కూడ ఆమెకు మైనస్గా ఉంది.
- మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు, ఆల్వాల్ కార్పోరేటర్ విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది. ఉద్యమంలో పాల్గొనడం, టీఆర్ఎస్ పార్టీకి విధేయురాలిగా ఉండడం ప్లస్ పాయింట్లు. కాగా హైదరాబాద్ కోర్ ఏరియాలో లేకపోవడం కొంత మైనస్గా మారిందని చెబుతున్నారు.
- చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి. ఈమె కూడా తన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి వర్గానికి, బొంతు వర్గానికి స్థానికంగా పొసగడం లేదు. అంతే కాకుండా గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ను ఆశించిన శ్రీదేవికి చెక్ పెడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడైనా సాయికిరణ్కు టిక్కెట్ ఇప్పించారు. అప్పటి నుంచి తలసాని వర్గంతోనూ విభేదాలు కొనసాగుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
- ఖైరతాబాద్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో కార్పొరేటర్గా గెలిచిన మన్నె గోవర్దన్రెడ్డి భార్య మన్నె కవిత పేరు కూడా వినిపిస్తోంది. సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్న కవితకు టిక్కెట్ ఇవ్వకూడదని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గతంలో కోరారు. అయినా పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన అప్పట్లోనే కొంత అసహనం ప్రదర్శించారు. మేయర్గా ఆమె ఎన్నికకు ఈ అంశం కూడా మైనస్గా మారే అవకాశం ఉంది.
- ఇక తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉండడం ప్రధాన సానుకూల అంశం కాగా గత ఎన్నికల సమయంలో ఈమెకు వ్యతిరేకంగా స్థానికంగా నిరసనలు వ్యక్తం కావడం మైనస్ పాయింట్.
ఢీ కొట్టేవారికే..
ప్రస్తుతం కార్పొరేషన్లో టీఆర్ఎస్కు 56 మంది కార్పోరేటర్లు, 32 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. అయితే బీజేపీకి 47 (మొత్తం 48) మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి పక్షాన్ని సమర్థంగా ఢీకొని పార్టీ విస్తరణకు ఉపయోగపడే వారిని మేయర్గా చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పలువురు మహిళా నేతల ప్రొఫైల్స్ను పరిశీలించి, నివేదికలు కూడా తెప్పించుకున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా ఈ విషయమై చర్చించినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.