ఏపీకి కేంద్రం మరో గుడ్న్యూస్ చెప్పింది. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం అంగీకరించింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కింద..ఈ రెండు నోడ్లలో మౌలిక సదుపాయాల కోసం ఫస్ట్ ఫేజ్లో రూ. 3 వేల 35 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో APIIC ద్వారా 1092 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ, ప్లగ్ అండ్ ప్లే, వాక్ టు వర్క్, పారిశ్రామిక సంస్థల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మాస్టర్ ప్లాన్లు, ఫీజిబులిటీ రిపోర్టులు, వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టుల తయారీకి టెండర్లు పిలిచేందుకు APIIC కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుల అమలు కోసం నిక్డిక్ట్, APIIC..ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. డిజైన్లు, నిర్మాణం, టెస్టింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు ఏపీఐఐసీ సన్నాహాలు చేస్తోంది.
హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,624.64 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కోసం రూ.1,771.19 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తంతో రోడ్లు, వంతెనలు, నీటి శుద్ధి ప్లాంట్లు, నీటి నిల్వ రిజర్వాయర్, చెత్త శుద్ధి ప్లాంటు, పరిపాలన భవనాల వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రాజెక్టు కోసం కేటాయించిన భూముల ధరలతో కలిపి రూ.2,786.10 కోట్లతో మొదటి దశలో పనులు చేపట్టేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భూములకు నిర్దేశించిన ధర రూ.1,071 కోట్లు పోను మిగిలిన రూ.700 కోట్లను APIIC రుణంగా తీసుకుని ఈక్విటీగా పెట్టుబడి పెట్టనుంది.
కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు
విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కడప జిల్లా కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో భారీ పారిశ్రామిక నోడ్ అభివృద్ధికి కూడా కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి దశలో రూ.1,264.44 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పార్కు కోసం కేటాయించిన భూములతో కలిపి రూ.2,136.51 కోట్లతో ప్రాజెక్టును అధికారులు రూపొందించారు. భూములకు నిర్దేశించిన ధర రూ.872 కోట్లు పోను.. మిగిలిన రూ.392 కోట్లను రుణంగా తీసుకుని ఏపీఐఐసీ ఈక్విటీ కింద పెట్టుబడి పెట్టనుంది. కొప్పర్తిలో సుమారు 5,760 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీసీఐసీలో అభివృద్ధి చేసే ప్రాంతం పోను మిగిలిన 3,164 ఎకరాల్లో పార్కు అభివృద్ధికి అయ్యే ఖర్చును తానే భరించనుంది