గుడివాడ, గన్నవరం..ఈ రెండు నియోజకవర్గాలకు ఏపీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ తరపున కొడాలి నాని విజయం సాధించగా..గన్నవరంలో టీడీపీ తరపున గెలిచిన వంశీ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. ఐతే 2024 ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొడాలి నాని, వంశీ ఘోర పరాజయం పాలై ఉనికిలో లేకుండా పోయారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తూ రాజ్యం నడిపించారు వంశీ, నాని. ఈ ఇద్దరు టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారే. కానీ కాలక్రమేణా ఇద్దరూ తల్లి లాంటి పార్టీని మోసం చేసి ఆ పార్టీకి బద్ధ శత్రువులుగా తయారయ్యారు. వైసీపీ హయాంలో చంద్రబాబును, ఆయన ఫ్యామిలీని అనరాని మాటలు అన్నారు.
ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతుంటాయి. 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. రెండు చోట్లా ఆ ఇద్దరు నాయకులు పరాజయం పాలయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించట్లేదు. నాని అనారోగ్య కారణాలంటూ హాస్పిటల్స్ అంటూ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇక వంశీ పలు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. దీంతో నడిపించే నాయకుడు లేక ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఆఫీసులు ఖాళీ అయిపోయాయి. గుడివాడలో వైసీపీ ఆఫీసు ఉన్న ప్రాంతాన్ని యజమాని ఖాళీ చేయించారు. దీంతో అక్కడ వైసీపీ ఆఫీసు మూతపడినట్లయింది.
గత ఎన్నికల్లో టీడీపీ తరపున NRI వెనిగండ్ల రాము విజయం దక్కించుకున్న గుడివాడలో ఇప్పుడు అభివృద్ధి సుమాలు విరుస్తున్నాయని స్థానికులు సైతం చెప్పుకొంటున్నారు. వర్గ పోరు లేదు. బెదిరింపులు లేవు. దీంతో గుడివాడలో వైసీపీ కి చెందిన క్షేత్రస్థాయి నాయకులు కూడా వెనిగండ్ల వైపు మొగ్గు చూపి.. కండువాలు మార్చుకుంటున్నారు.ఇక, గన్నవరంలో మాజీ వైసీపీ నాయకుడు, ఎన్నికలకు ముందు టీడీపీ చెంతకు వచ్చిన యార్లగడ్డ వెంక ట్రావు కూడా..ప్రజలకు చేరువగానే ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా.. పరిష్కరిస్తూ ప్రజల్లోనే ఉంటుిన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు సైతం యార్లగడ్డ వెంట తిరుగుతుండడం గమనార్హం. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న గన్నవరం పరిధిలో ఒకప్పుడు వంశీకి జైకొట్టిన వారు..ఇప్పుడు వెంకట్రావుకు మద్దతుగా నిలుస్తుండడం విశేషం..