అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం CID పోలీసులు అరెస్టు చేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుగా ఆయనపై CID అభియోగాలు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లెలో ఆయన నివాసం వద్ద CID అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫాంహౌస్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు సీఐడీ అధికారులు.
అక్కడే కల్యాణ మండపం నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. కల్యాణ మండపం అద్దెకు కావాలంటూ సీఐడీ డీఎస్పీ కొండయ్యనాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని వలపన్ని పట్టుకున్నారు. ఈ సమయంలో మాధవరెడ్డి తన సెల్ఫోన్లను నీటిలో పారేసే ప్రయత్నం చేయగా చాకచక్యంగా డీఎస్పీ పట్టుకొని తిరుపతి తరలించారు. అతని నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జులై 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో కీలక కుట్రదారుగా ఇప్పటికే మాధవరెడ్డిపై CID అభియోగాలు నమోదు చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో D-పట్టా, ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణలు భారీ ఎత్తున జరిగాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా ఆధారాలు ధ్వంసం చేయడం, అవినీతి దందాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, PA ముని తుకారాంలు కుట్రదారులని సీఐడీ దర్యాప్తులో తేలింది. మాధవరెడ్డి, పెద్దిరెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలను నిరూపించేలా, ఘటనకు ముందు పలుమార్లు వారి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు కాల్ డేటా రికార్డుల విశ్లేషణతో సీఐడీ వెల్లడించింది. ఈ విషయం ఇది వరకు అరెస్టయిన సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది.
ఇదే రిపోర్టులో పెద్దిరెడ్డి పాత్రను ప్రస్తావించింది. ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఘటన జరిగిన కొన్ని రోజులు పరారీలో ఉన్నారు. అనంతరం మదనపల్లెకు చేరుకుని బహిరంగంగా తిరుగుతూ ఓ రకంగా సవాలు చేస్తూ ప్రవర్తించారు. కీలక నిందితుడి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసులో నాలుగో నిందితుడైన ముని తుకారాం ఘటన జరిగిన వెంటనే విదేశాలకు పారిపోయారు. విదేశాలకు వెళ్లినా ఆరు నెలలకు మించి అక్కడ ఉండరాదనే నిబంధన ఉన్నప్పటికీ ఎలా కొనసాగుతున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. తుకారాం దేశంలోకి వస్తే కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉండటంతో అతన్ని రానీయకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన వారిలో మాధవరెడ్డి రెండో వ్యక్తి.