హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి ఈవీఎం ల గురించి ప్రస్తావన బయటికొస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారు 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగారు. ఆ తరువాత ఈవీఎం లు ఓపెన్ చేసిన కాసేపటికి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. ఈవీఎం కౌంటింగ్ లో బీజేపీ దూసుకెళ్లిపోయింది. చివరికి 48 స్థానాల్లో గెలిచి హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది. తొలుత 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన కాంగ్రెస్ ఫైనల్గా కౌంటింగ్ ముగిసే సరికి 37 నియోజకవర్గాలకే పరిమితమైంది.
ఇదే సమయంలో ఈవీఎం ల పనితీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ఉదాహరణలు తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలని.. అప్పుడు కానీ ప్రజస్వామ్యాన్ని కాపాడలేరనే చర్చ బలంగా నడుస్తుంది. ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “హర్యాన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి.. ప్రపంచ బ్యాంకు జీతగాడు.. చంద్రబాబు మోసగాడు.. అన్న కమ్యునిస్టు పార్టీల పాత పాట గుర్తుకొస్తుంది” అని మొదలుపెట్టారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రస్థావించారు. ఎలక్షన్ కమిషన్ 3 నెలల తర్వాత ఫార్మ 20 వెబ్ సైట్ లో పెట్టిందని.. ఇందులో పోలింగ్ బూత్ ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చని చెబుతూ… ఉదాహరణకు హిందూపురం నియోజకవర్గంలోని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఓ వార్డులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని వివరించారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో ఏపీ అంతా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని.. అయితే దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఫారం 20 వివరాలు బయటకు రాగానే.. తిరుమల లడ్డూ వ్యవహారం టీడీపీ వాళ్లు కుట్రలో భాగంగా, పక్కా స్కెచ్ తో మొదలుపెట్టారు.. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు.. ఇది నెయ్యి కోసమో, భగవంతుడి కోసమో మొదలుపెట్టింది కాదు.. ఈవీఎం మోసాలను కప్పిపెట్టడానికి మొదలుపెట్టిన అరాచకం అని రాసుకొచ్చారు సాయిరెడ్డి. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ను గుజరాత్ నుంచి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని అన్నారు. ప్రజలెవ్వరూ బూత్ వారీ లెక్కల గురించి మాట్లాడుకోకుండా లడ్డూ దీక్షలు, వగైరా వగైరా… ఇది స్థూలంగా జరిగిన కుట్ర అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత..కౌంటింగ్ ముగిసిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ జగన్ మాటలకి కొనసాగింపుగా కనిపిస్తోంది.











