విజయసాయిరెడ్డి మాటకు ముందు తనకు ఢిల్లీ భాజపా పెద్దల్లో చాలా గొప్పరిలేషన్స్ ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మేరకు ఆయన గతంలో కన్నాకు అక్షింతలు వేయించడం, రాష్ట్రప్రభుత్వం మాటల దాడిని పెంచినప్పుడు, అమరావతికి అనుకూలంగా మాట్లాడినప్పుడు కన్నాకు బ్రేకులు వేయించడం వంటివి అనేకం చేయించారని కూడా రాజకీయ వర్గాల్లో పుకార్లు వినిపిస్తుంటాయి. ఇప్పుడు ఆయన కొత్తగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పురందేశ్వరిపై చేస్తున్న విమర్శలు మళ్లీ మరో రకం చర్చకు తావిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమితురాలైన దగ్గుబాటి పురందేశ్వరి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో అమరావతి రాజధానికి తమ పార్టీ తరఫున పూర్తిస్థాయిలో జై కొట్టారు. భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానికే కట్టుబడి ఉంటుందని తెగేసి చెప్పారు. భారతీయ జనతా పార్టీని తాము లొంగదీసుకున్నాం అని.. ఆ పార్టీలో తమ మూడు ముక్కల నిర్ణయానికి అడ్డు చెప్పేవారు ఇక ఉండరని భావించిన వైఎస్సార్ సీపీ నాయకులకు ఇది ఇబ్బందికరమైన పరిణామం. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక అమరావతికి వ్యతిరేకంగా భాజపానుంచి గళమెత్తే వారులేనట్టే అని మురిసిపోతున్న సమయంలో.. దగ్గుబాటి పురందేశ్వరి వారికి కొరుకు పడడం లేదని అనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పురందేశ్వరి ఇంటర్వ్యూ మీద తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెట్టారు. ‘‘పురంధేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది.’’ ఈ మాటల ద్వారా.. ఆమెను కమ్మ కులానికి ప్రతినిధిగా అభివర్ణించడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి కూడా.. అమరావతి మీద ఒక రకమైన విషప్రచారానికి తెగబడుతోంది. కేవలం కమ్మ కులానికి ప్రాధాన్యం ఇవ్వడానికే, లబ్ధి చేకూర్చడానికే చంద్రబాబునాయుడు.. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు పూనుకున్నాడనేది ఆ పార్టీ ఆరోపణ. ప్రతిసారీ.. కమ్మకులానికి ముడిపెట్టి ఆరోపణలు చేస్తోంది. అక్కడి జరిగే ప్రతి పోరాటాన్ని, ప్రతి ఉద్యమాన్ని కూడా కమ్మకులానికి ముడిపెట్టి.. మిగిలిన కులాలనుంచి, సామాజిక వర్గాలనుంచి ఆ పోరాటాలకు మద్దతు దక్కకుండా ఉండేందుకు ఒక వ్యూహాత్మక కుట్రను కొనసాగిస్తోంది.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కొత్త జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అమరావతికి అనుకూలంగా మాట్లాడితే.. ఆమెకు కూడా కమ్మ కుల భావజాలాన్ని పులమడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించడం పట్ల.. బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వెటకారం చేస్తున్న రీతిలో జాతీయ నాయకురాలని, జాతి నాయకురాలిగా విజయసాయి ఎద్దేవా చేయడం తీవ్రమైన సంగతిగా పార్టీ నాయకులు పరిగణిస్తున్నారు. ఇలాంటి సంకుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పురందేశ్వరికి క్షమాపణ చెప్పాలని కూడా పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి.
మొత్తానికి విజసాయి మాటలు ఇరు వర్గాల మధ్య అగ్గి రాజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యాలపై అటు బీజేపీ నుంచి కూడా ఎదురుదాడి ఉంటుందని.. ఈ వివాదం ఇరు పార్టీల మధ్య మరింతగా ముదురుతుందని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి.
పురంధేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది.
Posted by Vijay Sai Reddy on Sunday, 27 September 2020