నవ్యాంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పట్లోనే రాష్ట్రానికి కియా అనే కార్ల తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చి సంచలనం క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే పేరున్న ఆ కంపెనీ ఏపీలో అందులోనూ అనంతపురంలో ప్లాంటు నెలకొల్పడం చంద్రబాబు సమర్థతకు నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ న చంద్రబాబు రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఏపీలో ఆ సంస్థ యూనిట్ ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి చూపిస్తోంది. దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తోంది.
ఈ విన్ ఫాస్ట్ ఈవీ కార్ల తయారీ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఆ పరిశ్రమ ఏర్పాటు చేస్తే వాటికి అవసరమైన భూమిని కేటాయించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన అంగీకారం తెలిపారు. వియత్నాంకు చెందిన ఈ సంస్థకు విద్యుత్తు వాహనాల తయారీలో ప్రపంచంలోనే మంచి పేరుంది. ఈవీ ప్లాంటు ఏర్పాటులో భాగంగా వచ్చిన విన్ఫాస్ట్ ప్రతినిధి బృందంతో చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. చంద్రబాబుకు కూడా పెట్టుబడిదారుల్ని ఆకట్టుకుని రాష్ట్రానికి రప్పించడంలో ఎంతో అనుభవం ఉంది.
ఈ సమావేశంలోనే ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సంస్థ సీఈఓ పామ్ సాన్ చౌ, విన్ ఫాస్ట్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. ఈవీ, బ్యాటరీ తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైన భూమి, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు తాము, తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ రెడీ అని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. విన్ ఫాస్ట్ సంస్థ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఏర్పాటు చేసేలా చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.
అంతర్జాతీయంగా పేరున్న కియా సంస్థ ఏపీలోకి.. అనంతపురం జిల్లాలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయడంతో జిల్లా రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు ఈ విద్యుత్తు వాహన, బ్యాటరీ తయారీ పరిశ్రమ విన్ ఫాస్ట్ కూడా ఏపీకి వస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని అంటున్నారు. పైగా ఈ ప్లాంటును కడపలో ఏర్పాటు చేస్తే.. జగన్ ఇలాకాలో చంద్రబాబు సత్తా చాటినట్లు అవుతుందని భావిస్తున్నారు.