తెలంగాణలో కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్పై దూకుడు గానే వ్యవహరిస్తున్నారు. పార్టీలో పెద్దలను, నాయకులను కలుస్తూ అందరిని కలుపుకుంటూ పోతూ పార్టీని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని కాంగ్రెస్ లో ఎన్నడూ ఎవరు నిర్వహించని రీతిలో నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై పదునైన మాటలతో దాడి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త జోష్ ను నింపారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో రేవంత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం అవడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ నాయకత్వాన్ని అభినందిస్తున్నారు.
ఆయా కులాలకు భరోసా ఏది?
రేవంత్ నాయకత్వంలో దళిత, గిరిజన దండోరా సభలు మొదట ఇంద్రవెల్లి, తదుపరి రావిరాలలో నిర్వహించారు. మూడవదిగా మూడు చింతలపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. 40 సంవత్సరాల క్రితం ఆదివాసీలను కాల్చి చంపిన కాంగ్రెస్ పట్ల ఆదివాసీలకు వ్యతిరేకత ఉంది. కానీ అదే సామాజికవర్గ కాంగ్రెస్ నేతల కృషితో ఇంద్రవెల్లి సభకు ఆదివాసీలు, దళితులు పోటెత్తారు. ఎవరు ఊహించని రీతిలో సభ సక్సస్ అయింది. అలాగే రావిలాల లో నిర్వహించిన రెండవ సభ కూడా సక్సస్ అయింది. మొన్న జరిగిన మూడు చింతలపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష కి కూడా వేలాదిగా దళిత, గిరిజనులు తరలివచ్చి జయప్రదం చేశారు. ఈ సభలకు హాజరైన ప్రజలు, సభల నిర్వహణ తీరు చూస్తే కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ సభలలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలు చూస్తే రానున్న ఎన్నికలకి ముందే ప్రచార పర్వం మొదలైనట్టు కనిపిస్తుంది. అధికార పార్టీ ఆదివాసీల పోడు భూములను గుంజుకోవడం, గిరిజనుల హక్కులను కాలరాయడం, వారికి జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అలాగే కేసీఆర్ దళితులకు చేసిన మోసాన్ని( దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ వగైరా) ఎండగడుతూ.. దళితబంధు హుజురాబాద్ ఎన్నికల కోసమే అని, ఎన్నికల తరువాత పట్టించుకోరు అని, తెలంగాణాలోని దళితులందరికి దళిత బంధు ఎందుకు ఇవ్వరు అంటూ అధికార పార్టీని ఇరుకున పెట్టేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన మోసాలను కూడా ఎండగడుతున్నారు కానీ ఇంతవరకు జరిగిన సభలలో కేసీఆర్ ను తిట్టడానికి, కాంగ్రెస్ నాయకుల మరియు రేవంత్ ఊకదంపుడు ప్రసంగాలను చూపించుకోవడానికి మాత్రేమే కనిపిస్తుంది కానీ, దళిత, ఆదివాసీలకు కాంగ్రెస్ ఏమి చేస్తుందో స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
అంతా ఊకదంపుడే
నన్ను చూడు నా పెర్ఫార్మన్స్ చూడు అన్న రీతిలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ..కేసీఆర్ ను తిడుతూ ఏ సామాజిక వర్గం సమస్యలపై సభలు నిర్వహిస్తున్నారో వారి అభ్యున్నతి కోసం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ విధంగా పాటు పడతామో అనే స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే… బలుపు, వాపు చూపించుకునే సభలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆయా సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరే అవకాశం ఉండదు. ఆయా సామాజిక వర్గాల పట్ల ఒక బాధ్యతారాహిత్య పార్టీగా ముద్ర పడే అవకాశంతో పాటూ , ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చేజార్చుకునే ముప్పు పొంచి ఉంది అని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాకుండా ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టడానికే ఈ సభలను నిర్వహిస్తున్న రేవంత్.. వారికి తాము ఏం చేస్తామన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. అయినా గానీ.. రేవంత్ సభలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సభలకు జనం స్వచ్ఛందంగానే వస్తున్నారా? లేదంటే.,. రేవంత్ తన సభలకు వచ్చేవారికి ఏం ఇచ్చి రప్పిస్తున్నారన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Must Read ;- ఏపీలో గురువు.. తెలంగాణలో శిష్యుడు











