నిజంగా మానవ జన్మ అంత నీచనికృష్టమైనదా? అసలు మనం ఈ భూమ్మీద ఎందుకు పుట్టాం… ఎందుకు చనిపోతున్నాం? చనిపోయాక ఎక్కడికి పోతాం? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి.
మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు ఉత్తమోత్తమమైనది. పునరపి జననం… పునరపి మరణం అంటారు. జన్మ అంటే మళ్లీ పుట్టడం… అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది.
మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చేరువ కావడానికి దొరికిన ఓ అపూర్వమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు. అయినా పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు మన పురాణ గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచి తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు. ఇందులో మరో దారి లేదు.
మనుషులకేనా చెట్లకు ఉండవా?
ఇవన్నీ మానవ మాత్రులకేనా చెట్టూ చేమలకు ఉండవా అని మీరనుకోవచ్చు. అక్కడికే వద్దాం. ఒక చెట్టుకు మొగ్గ వచ్చింది. అది పువ్వై ఆ తర్వాత కాయగా మారింది. పండిపోయి కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పిందెగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ ఆ నీటి తడిని మీరు చూడవచ్చు. కానీ పండు రాలినప్పుడు కొమ్మలో ఎలాంటి నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టి అక్కడ నీటి తడిని మనం చూస్తుంటాం.
అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ‘అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా’ అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు…. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు. పండు మొదలు లోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.
సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాధే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండువైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేయాలి.
కర్మ ఫలాలు ఏమిటో తెలుసుకుందాం…
జ్ఞానం, కర్మలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు కర్మల రూపంలో మనతోనే వస్తాయి. ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఆగామి, సంచితం, ప్రారబ్దం అని మూడు రకాలుగా ఈ కర్మలు ఉంటాయి. నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల కిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి… మరికొన్ని తర్వాతి జన్మల్లో ఫలితాన్ని చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎన్ని పుణ్యాలు చేశాం? దానదర్మాలు ఏమైనా చేశామా… లాంటివన్నీ ఆగామి కర్మల కిందిదకే వస్తాయి.
ఇక సంచిత కర్మలలోకి వెళదాం. మనం పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చాయనుకోండి మనం ఈ జన్మలో కూడా వాటిని అనుభవించకుంటే అవి మళ్లీ రాబోయే జన్మకు వెళ్లిపోతాయి. వీటిని సంచిన కర్మలు అంటారు. ఉదాహరణకు గత జన్మలో మీరు ఒకర్ని హత్య చేశారనుకుందాం ఈ జన్మలో దాని ఫలితం అనుభవించాల్సి ఉన్నా రకరకాల కారణాలవల్ల అది జరగలేదు… అది రాబోయే జన్మకు తరలిపోతుంది. దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని మనం తరచూ అంటూ ఉంటాం.
సంచిత కర్మల్లో కచ్చితంగా అనుభవించి తీరాల్సినవి ఉంటాయి. వాటినే ప్రారబ్దం అంటారు. ఇందాకటి ఉదాహరణ విషయానికే వస్తే గత జన్మలో మీరు చాల హత్యలు చేశారనుకోండి… పైగా మీ దగ్గర పుణ్యబలం కూడా లేదనుకోండి జన్మ తీసుకోగానే దాని సమయం వచ్చినప్పుడు ఆ ప్రారబ్దం తగిన ఫలితం చూపిస్తుంది. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది ప్రారబ్ద కర్మ కాబట్టే అతను అనుభవించక తప్పలేదు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.
పుణ్య కర్మలు పక్వానికి వస్తే ఆ వ్యక్తి దేవలోకంలో పుడతాడు. ఆ కర్మల ఫలితంగా అనేక భోగాలు అనుభవిస్తాడు. ఆ భోగాలు అయిపోగానే ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లు మళ్లీ మానవ లోకాన్ని చేరుకుంటాడు. అక్కడ మళ్లీ మనిషిగానో, జంతువుగానో పుడతాడు. అంతకుముందు అతను దేవలోకంలో పుట్టినా అతనికి కర్మలు చేసే స్థూల శరీరం ఉండదు. ఎందుకంటే అక్కడ భోగాలు అనుభవించటానికి మాత్రమే అధికారం ఉంటుందిగాని కర్మలు చేసే అధికారం ఉండదు. పుణ్య కర్మలు పక్కన పెట్టి మనం పాపాలు మాత్రమే చేస్తూ పోయామనుకోండి అవి కూడా పక్వానికి వస్తాయి. అప్పుడు ఏ కుక్కగానో పిల్లిగానో పుట్టక తప్పదన్నమాట.
ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమే కాదు కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా మనిషికి ఈ జన్మలోనే ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు. కర్మలను బట్టే మనిషి బుద్ధి మారుతుంటుంది. బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ మానవ జన్మ. పరమాత్మను చేరుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారాన్ని, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్నది ఒక్క మానవ జన్మలోనే. అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అపురూపమైనది. 84 లక్షల జీవరాసుల్లో పుట్టి గిట్టిన తర్వాతే ఈ మనిషి జన్మ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. మనిషి తన జన్మకు ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, కోట్లు సంపాదించాలి… అనేది మాత్రమే లక్ష్యం కాదు. జ్ఞానసముపార్జన చేయాలి.
ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించినా మన మనస్సులో ఏదో ఒక వెలితి మాత్రం ఉంటుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే జ్ఞానమార్గం ఒక్కటే దారి. ‘నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం’ అని తత్వబోధలో శంకరాచార్యులవారు స్పష్టంగా చెప్పారు. అంటే నిత్య వస్తువు అనేది ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకు భిన్నంగా ఉంటే అవి అశాశ్వతం అని అర్థం. ప్రతి జీవి భగవంతుడిలో ఐక్యం కాగలిగినప్పుడే ఈ జన్మకు ముక్తి లభిస్తుంది. ఆ ముక్తి మార్గానికి దారి తెలియాలంటే అది మానవ జన్మలోనే సాధ్యం. నేను ఎవరు ? ఎందుకు పుట్టాను ? ఎవరికోసం పుట్టాను? నా లక్ష్యం ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి ? అని తెలుసుకొని మనస్సును అదుపులో పెట్టుకొని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవలి.
ఆత్మకు పరమాత్మకూ తేడాని తెలుసుకోవడమే జ్ఞానం. భగవంతుడిని తెలుసుకోవాలన్న తపన నీలో ఉంటే ఆ భగవంతుడే నీకు దారి చూపిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడి ధ్యాన యోగంలో ‘అర్జునా! ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని (కర్మ,జ్ఞాన, ధ్యాన) అవలంబించి ఉంటారో వారు ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సి ఉంటే వారికి కచ్చితంగా ఒక మంచి జన్మ వస్తుంది’అని చెప్పాడు. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనిషి ముందుకుసాగాలి. అప్పుడే జీవన్ముక్తి సాధ్యం. అప్పటిదాకా ఈ భవబంధాలను అనుభవించాల్సిందే.
-హేమసుందర్ పామర్తి