“కరోనా మన వెంటే ఉంటుంది. దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే. దాన్ని అడ్డం పెట్టుకుంటే ముందుకు వెళ్లలేం“ ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మూడు నెలల క్రితం చేసిన ప్రకటన. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశంలో ఏ రాష్ట్రంలోను కరోనా తీవ్రత ఇంత స్ధాయిలో లేదు. దీంతో ముఖ్యమంత్రి ప్రకటనతో ఏకీభవించిన వారు ఎక్కువ మందే ఉన్నారు.
అయితే, రాను రాను పరిస్థితులు మారిపోయాయి. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందల మంది మృత్యువాత పడుతున్నారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మిగిలిన రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి సమయంలో సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేతక వస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం తన మొండి వైఖరిని వీడడం లేదు. పాఠశాలలకు విద్యార్ధులను పంపించాలనే హుకుం జారీ చేస్తున్నారు. వ్యాక్సిన్ రాకుండా పాఠశాలలకు పంపేది లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలల శానిటైజింగ్ బాధ్యత తల్లిదండ్రుల కమిటీ, ఉపాధ్యాయులదే…
పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత స్థానిక పాఠశాలల్లో ఎన్నిక కాబడ్డ పాఠశాల తల్లిదండ్రుల కమిటీదేనని ప్రభుత్వం స్సష్టం చేస్తోంది. అంటే పాఠశాలను శానిటైజ్ చేయించడం, విద్యార్థులు శానిటైజ్ చేసుకునేందుకు వీలుగా శానిటైజర్ బాటిళ్లు అందుబాటులో ఉంచడం, మాస్కులు లేని వారికి వాటిని ఏర్పాటు చేయడం వంటివన్నీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీతో పాటు ఆ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులదేనని పాఠశాల విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అసలు పిల్లలను స్కూళ్లకు పంపడమే కష్టం అనుకుంటున్న ఈ తరుణంలో వ్యాక్సినేషన్ వంటి వాటి కోసం తామే డబ్బులు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకు వస్తామని ఆందోళన చెందుతున్నారు. పొరపాటున ఏ విద్యార్థికైనా కరోనా వైరస్ సోకితే దానికి బాధ్యత వహించాల్సిందిగా ఉపాధ్యాయులను ఇరికిస్తే ఎలా అని వాపోతున్నారు.
పట్టణాలు సరే… పల్లెల్లో ఎలా…
కరోనా ఉన్నా పట్టణాలలో ఉన్న పాఠశాలలు ఎలాగో అలాగ దాని నుంచి రక్షణ పొందుతారని, పల్లెల్లో మాత్రం దాని నుంచి బయట పడడం కఫ్టమనే వాదన వినిపిస్తోంది. పట్టణాలలో శుచి, శుభ్రత పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, పల్లెల్లో చాలా మంది చిన్నారులు స్నానం కూడా చేయకుండా పాఠశాలలకు వస్తారని ఉపాధ్యాయ వర్గాలనుంచి వాదన వినిపిస్తోంది. అలాగే పల్లెల్లో కరోనా నిర్దారణ పరీక్షలు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయని, అలాంటప్పుడు కరోనా వైరస్ సోకిన వారిని ఎలా గుర్తిస్తామన్నది ఉపాధ్యాయుల ప్రశ్న. ఇదే విషయాన్ని అధికారుల ముందు ప్రస్తావిస్తే వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
9, 10 తరగతులు చాలు…. మిగిలిన తరగతులు పాస్
ఈ విద్యా సంవత్సరం వరకూ 9, 10 తరగతులను మాత్రమే నిర్వహించాలని, మిగిలిన తరగతుల వారిని పై తరగతులకు ప్రమోట్ చేస్తే బాగుంటుందంటూ గురుకుల పాఠశాలల నుంచి ప్రభుత్వానికి సూచనలు వెళ్లాయి. అయితే, ఈ అంశంపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ ఉపాధ్యాయ సంఘాలు కూడా వాదిస్తున్నాయి.
ఇప్పటికే గ్రామాల్లో కరోనా తన విశ్వరూపం చూపిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వారంటున్నారు. మరో వారం రోజుల్లో స్కూళ్లు ప్రారంభమైతే ఇబ్బందులు తప్పవనే ఆందోళన అటు తల్లిదండ్రుల్లోను, ఇటు ఉపాధ్యాయుల్లోనూ నానాటికీ పెరుగుతోంది. చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో…!