అవినీతిని అంతం చేయాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ వార్షిక సమావేశంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం వింటే ఎవరికైనా 27 సంవత్సరాల కిందట విడుదలైన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ డైలాగులే టక్కున గుర్తుకు వస్తాయి. వారసత్వ అవినీతి దేశాన్ని చెదపురుగులా నమిలేస్తోందని ఈ సదస్సులో ఉన్నత అధికారులనుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం దేశ ప్రజలకు ఆలోచనలో పడేస్తోంది.
ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడేళ్లు కావస్తోంది. ఆ ఏడేళ్ల కాలంలో ఏమి సాధించారో వారిని వారే ప్రశ్నించుకోవాలి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ మాల్వా బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారి పోయే వరకూ మొద్దు నిద్ర నటించింది బీజేపీ ప్రభుత్వం కాదా? ఇక లిలిత్ మోడీ లాంటి అక్రమార్కులు బ్యాంకులను ముంచి పారిపోయేదారి ఇచ్చి, తరవాత వారిని స్వదేశం తీసుకువస్తామని బీరాలు పలుకుతోంది కేంద్రంలోని బీజేపీ పెద్దలే కాదా అనే ప్రశ్నలు ప్రజలనుంచి వస్తున్నాయి.
చిన్న కేసును వదలినా పక్కవారికి ధైర్యం వస్తుంది
ప్రధాని మోడీ మాటల మనిషని ప్రజలు గ్రహించారు. విదేశాల్లో అవినీతి పరులు దాచిన 15 లక్షల కోట్లు భారత్ కు తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో పది లక్షలు జమచేస్తామని 2014లో చెప్పిన ఈ పెద్ద మనిషి నేటికి సాధించింది గుండుసున్నా. అవన్నీ జనానికి గుర్తులేవు అనుకుంటారో ఏమో, అవినీతిపై మాట్లాడే అవకాశం దొరకితే మాత్రం భారతీయుడు సినిమాలో డైలాగులన్నీ ఒకే స్కిట్ లో వదులుతారు.
ఆ ప్రసంగం విన్నంత సేపు ఇక భారతదేశంలో అవినీతికి తావులేదేమో అనిపిస్తుంది. అవినీతిపరులందరినీ ఒకే సారి జైల్లో పెట్టడం కూడా మనదేశంలో సాధ్యం కాదు ఎందుకంటే జైళ్లు పట్టనంత మంది అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. ఎంత ఎక్కువ అవినీతి చేస్తే అంత గొప్ప నేత అన్న చందంగా తయారైంది దేశంలో పరిస్థితి. వేల కోట్ల అవినీతి చేసిన వారు కూడా ఎక్కడా గిల్టీగా ఫీల్ అవడం లేదు. ఎందుకంటే అవినీతి చేయాలంటే దమ్ము, ధైర్యంతోపాటు, చట్టాలను చుట్టాలుగా మార్చుకునే నేర్పు ఉండాలి.
అందుకే అవినీతి పరులు మాకు మేమే స్పెషల్ అన్న చందంగా గుండీలు విప్పి తిరుగుతున్నా ఎవ్వరూ వారిని నేరస్థులుగా చూడటం లేదు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాడే కింగ్ అన్నవిధంగా తయారైంది. సదరు వ్యక్తి ఆ డబ్బు నీతిగా సంపాదించాడా, అవినీతికి పాల్పడ్డాడా అని ఎవరూ చూడటం లేదు.
తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే తరువాతి తరం రెచ్చిపోతుందట
రూ.43 వేల కోట్ల అవినీతి కేసుల్లో 11 ఛార్జీషీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చి గంటలు గంటలు మాట్లాడినప్పుడు ప్రధాని మోడీకి తెలియదా? తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే తరవాత తరం రెచ్చిపోతుందని. దేశంలో రాజకీయాలు వ్యాపారంగా మారాయి. ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చు చేయడం గెలిస్తే రూ.5000 కోట్లు వెనకేసుకోవడం. ఇంత కన్నా లాభసాటి వ్యాపారం భూమిమీద ఏదైనా ఉంటుందా? అంటే కష్టమేనని చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని అవినీతి కేసులను తేల్చారు. ఎంత మందిని జైల్లో పెట్టారు అంటే సమాధానం రాదు.
ఎంత సేపటికీ…. సినిమా డైలాగులను జనం మీదకు వదలడం మీడియాలో కవరేజీ వచ్చేలా చూసుకోవడం. ఈ ఆటలు ఎంతో కాలం సాగవు. చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడైనా పొంతన ఉందా? లేదా? అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ప్రజలు ఎప్పుడూ గొర్రెలు కాదు. ఒక్కసారి మోసపోతారేమో, ప్రతిసారీ ప్రజలు మోసపోరని కేంద్రంలోని బీజేపీ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి.
వైసీపీ- ఎన్డీయేతో జట్టు కట్టడం అనేది జరిగే పనేనా?
జగన్ గురించే చెప్పినట్టుగా.. మోడీ ప్రవచించిన అవినీతి లక్షణాలు అన్నీ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయనేది విచారణలో ఉన్న కేసుల ద్వారా కలిగే భావన. ఎన్డీయేలో వైసీపీ చేరుతోందని, వారికి మూడు మంత్రి పదవులు కూడా ఇచ్చేస్తున్నారంటూ సోషల్ మీడియా, మీడియాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కొందరైతే వైసీపీకి ఏఏ శాఖలు వచ్చే అవకాశం ఉందో కూడా రాసేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగింది. ప్రధాని మోడీ అవినీతిపై యుద్ధం చేస్తూ ఉంటే, అవినీతి కేసుల్లో విలవిలలాడుతున్న వైసీపీ నేతలను కేంద్ర క్యాబినెట్లోకి ఎలా తీసుకుంటారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బతిమిలాడినా మంత్రి పదవులు తీసుకోలేదని కొందరు వైసీపీ నేతలు ఏపీలో ప్రచారం చేశారు. ఈ వార్తలను కొందరు బీజేపీ నేతలు ఖండించినా, ఏపీ బీజేపీ సారధి వీర్రాజు మాత్రం అసలు ఆ విషయం తనకు తెలియదన్నట్టే వ్యవహరించారు.
అవినీతి అంతుచూసేదాకా ప్రధాని మోడీ నిద్రపోయేలా లేరని, యాంటీకరప్షన్ సమావేశ వేదిక మీద నుంచి వచ్చిన ఆయన మాటలు మొత్తం.. గుండె లోతుల్లోంచి వచ్చినవే అని మనం భావిస్తే ఎన్డీయేలో వైసీపీని చేర్చుకునే అవకాశం లేదని చెప్పుకోవాలి. లేదా ప్రధాని ప్రసంగం చేసిన వేదిక అలాంటిది కాబట్టి ప్రతి సంవత్సరం ఇవే డైలాగులు అధికారులు రాసి ఇస్తారు కాబట్టి ప్రధాని కూడా అవే చెబుతున్నారని కూడా భాష్యం చెప్పుకోవచ్చు.
చెప్పే మాటలకు చేతలకు అసలు పొంతన ఉందా?
మాటలు బాగా చెప్పేవారి చేతల్లో అంత పనితనం కనిపించదంటారు. ప్రధాని మోడీ విషయంలో ఇదే నిజమనిపిస్తుంది. గట్టిగా గుండెలు బాధుకుని చెప్పడం ద్వారా మీడియాలో బాగా మైలేజ్ వస్తుందేమో కానీ, ప్రజలు మాత్రం అంతా గమనిస్తూనే ఉంటారు. ప్రధాని సాబ్ ఏం చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ నిశితంగా పరిశీలిస్తూనే ఉంటారు. వేదికలపై అవినీతి అంతం చేస్తామంటూ గట్టిగా అరవడం కన్నా, క్షేత్ర స్థాయిలో అవినీతికి పాల్పడ్డవారికి శిక్ష వేసి జైల్లో పెడితే ప్రజలు చాలా సంతోషిస్తారు. ప్రధాని పదవిలో ఉన్న మోడీ తను ప్రధాని అని మరచిపోయి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అతని చేతిలో అధికారం పెట్టుకుని ఎవరో వచ్చి అవినీతి అంతం చేయాలన్నట్టుగా ప్రధాని మోడీ ప్రసంగాలు చేయడం చూస్తుంటే ప్రజలకు హాస్యాస్పదంగా అనిపిస్తోంది.