ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం నమోదైంది. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి సోమవారం అరెస్టయ్యాడు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జగన్ ఐదేళ్ల పాలన కాలంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్టు కావడంతో వైసీపీ హయాంలో సీఎంవోలో కీలకంగా పని చేసిన కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు, పీఏల గుండెల్లో దడ మొదలైనట్లు తెలుస్తోంది. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ భేటీల్లోనే మద్యం విధానం ద్వారా ఎంత మేర, కిక్బ్యాక్స్ ఎలా వసూలు చేయొచ్చనే దానిపై చర్చలు, నిర్ణయాలు జరిగినట్లు తేల్చింది. ఈ సమావేశాలన్నింటిలో కీలకంగా ఉన్న రాజ్ కెసిరెడ్డి అరెస్టు కావటంతో..విచారణలో తమ బండారం బయటపడే అవకాశముందని ఆ మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రూ.3 వేల కోట్ల స్కామ్
వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 వరకూ ముడుపులు తీసుకున్నట్లు, ఇలా నెలకు రూ.60 కోట్ల చొప్పున నాలుగేళ్ల రెండు నెలల్లో రూ.3 వేల కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ముడుపుల వసూళ్ల కోసం హవాలా వ్యవస్థను రాజ్ కెసిరెడ్డే నడిపించినట్లు సిట్ గుర్తించింది. లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకర్ని ప్రతినిధిగా నియమించుకునేది. ఆ ప్రతినిధి ఇద్దరు, ముగ్గుర్ని క్యాష్ హ్యాండ్లర్లుగా పెట్టుకునేవారు. లంచం సొమ్మును వారికి ఇచ్చేవారు. ఈ క్యాష్ హ్యాండ్లర్లు.. రాజ్ కెసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు. క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒకచోటకు చేర్చేందుకు కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు. ఆ ఆర్గనైజర్…సొమ్మంతా రాజ్ కెసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ కెసిరెడ్డి నుంచి ఈ సొమ్ము వైసీపీ, మంత్రివర్గంలో నంబర్ 2గా చక్రం తిప్పిన పెద్ద నేత కుమారుడికి వెళ్లేది. ఆయన ఆ నల్లధనాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్బాస్కు చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. దీనిపై లోతుగా విచారించి ఆధారాలు సేకరించి, రాజ్ కెసిరెడ్డిని అదుపులోకి తీసుకుంది.
లంచాల కోసం న్యూ లిక్కర్ పాలసీ –
ముడుపుల వసూళ్లకు వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్ కెసిరెడ్డితో పాటు, నాటి ప్రభుత్వంలో, పార్టీలో నంబర్-2 నేత కుమారుడు, మరో ప్రజాప్రతినిధి, APBCL అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్తో పాటు నాటి సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ అధికారి, మరో ఓఎస్డీ, మరికొంతమంది రహస్యంగా సమావేశమైనట్లు సిట్ గుర్తించింది. మొత్తం కుంభకోణానికి ఈ సమావేశాల్లోనే ప్లాన్ రచించారని ఆధారాలు సేకరించింది. అప్పట్లో ఏం జరిగింది? ఎలా జరిగిందనేదానిపై వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు ఇప్పటికే వాంగ్మూలాలిచ్చారు. డిస్టిలరీల ప్రతినిధులు, యజమానులు సైతం ఈ ముడుపుల వసూళ్ల గురించి పూసగుచ్చినట్లు సిట్కు చెప్పారు. ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డిలనూ ఇప్పటికే సిట్ విచారించి ప్రశ్నించింది. వీటన్నింటి ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తులు, అధికారుల ప్రమేయంపై సిట్ విచారిస్తోంది.