ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. టీడీపీ కార్యాలయంపై వైసీపీ జరిపిన దాడిపైనే చర్చ జరుగుతోంది. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దాడి జరిగిన ప్రదేశంలోనే 36 గంటల పాటు దీక్షకు దిగితే.. చంద్రబాబు దీక్ష హైలెట్ కాకుండా ఉండేలా వైసీపీ జనాగ్రహ దీక్షల పేరుతో పోటీ నిరసనలకు దిగింది. వెరసి గురువారమంతా చంద్రబాబు చేపట్టిన ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్ష, వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలతోనే గడిచిపోయింది. దాడి జరిగి ఇప్పటికే రెండు రోజులు అవుతున్నా.. బాధితురాలి హోదాలో టీడీపీ నిరసనలు చేపట్టడం సవ్యమేనన్న వాదనలు వినిపిస్తూ ఉంటే.. దాడికి దిగి నిందితురాలిగా ఉన్న వైసీపీ జనాగ్రహ దీక్షలు ఎలా చేపడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీక్షల పేరిట రోడ్డెక్కుతున్న వైసీపీ నేతలు.. టీడీపీపైనా, ప్రత్యేకించి చంద్రబాబుపైనా నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇందులో భాగంగా కొందరు వైసీపీ నేతలు అయితే తమ నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేస్తున్నారు.
రాయలసీమలో చంపేస్తారట
ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయని, ఇందులో ఏమాత్రం తప్పు లేదన్న రీతిలోనూ పలువురు వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఇదే వాదనను వినిపింపిచిన జగన్ సొంత జిల్లా కడపలోని మైదుకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ సీనియర్ నేత రఘురామరెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో వైసీపీ వాళ్లు టీడీపీ కార్యాలయాలపై మాత్రమే దాడులు చేసి వదిలేశారని.. అదే తమ రాయలసీమలో అయితే టీడీపీ నేతలను ఖూనీ చేసేవాళ్లమని రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైదుకూరులో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో పాలుపంచుకున్న సందర్భంగా రఘురామిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై చర్యలేమిటంటీ?
టీడీపీ నేతలను ఖూనీ చేసేవాళ్లమంటూ వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్నంతనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో అయితే టీడీపీ నేతలను ఖూనీ చేసేవాళ్లమంటోన్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. తన సైకో ఫ్యాన్సే టీడీపీ కార్యాలయంపై బీపీతో దాడి చేశారని ఒప్పుకున్న సైకో రెడ్డిని కూడా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా చేర్చాలని కూడా లోకేశ్ కోరారు. జగన్ రెడ్డి మీకే కాదు ఫ్యాన్స్.. మాకూ ఉన్నారు లక్షల మంది ఫ్యాన్స్. వాళ్లకి బీపీ వస్తే నువ్వు ఏపీలో ఉండలేవు అంటూ కూడా లోకేశ్ హెచ్చరికలు జారీ చేశారు.