ఏపీలో 2019-24 మధ్య కాలంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది కూటమి సర్కార్ స్పష్టం చేసింది. ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల లిక్కర్ మాత్రమే అమ్ముడయ్యేలా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొందరు టాప్ లీడర్లు దాదాపు 3 వేల 500 కోట్ల రూపాయలు ముడుపులుగా దండుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. లిక్కర్ కేసులో ముందుస్తు బెయిల్ వచ్చేలా ఆదేశించాలంటూ మిథున్రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వేయగా..ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. లిక్కర్ అమ్మకాలను మానిప్యూలేట్ చేసి టాప్ లీడర్లకు లంచాలిచ్చేందుకు…కొన్ని ఎంపిక చేసిన కంపెనీల బ్రాండ్లు మాత్రమే రాష్ట్రంలో అమ్మేలా కుట్రను అమలు చేసినట్లు పేర్కొంది.
ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మాన్యువల్ విధానం తీసుకొచ్చి నచ్చిన సంస్థలకే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చి ముడుపులు దండుకున్నట్లు తెలిపింది. ఇందులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి కీరోల్ పోషించారని పేర్కొంది. ఈ కుంభకోణంలో లబ్ధి పొందినవారి వివరాలు రాబట్టేందుకు మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది.
కౌంటర్లో రిపోర్టులివే –
లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారి. మొత్తం వ్యవహారానికి రూపకల్పన చేసి, నడిపించడంలో ఆయనే కీలకం. ఆయన, మరికొందరు నిందితులు కలిసి మొతతం మద్యం విధానం, దాని రూపురేఖలు మార్చి..తమతోపాటు, కావాల్సిన వారికి ముడుపులు అందేలా వ్యూహం పన్నారు. వీటిలో అత్యధికం నగదు, బంగారం రూపంలో అందుకున్నారు. ఈ మేరకు సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతర మెటీరియల్ సేకరించాం. మిథున్రెడ్డితోపాటు, ఈ కుంభకోణం ద్వారా ప్రయోజనం పొందినవారిని గుర్తించడానికి, ఆర్థిక లావాదేవీలను వెలికి తీయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. అందువల్ల పిటిషనర్ను కస్టడీలోకి తీసుకుని విచారించాలి.
……………………..
ప్రభుత్వ పోర్టల్ నుంచి తప్పించి..
2019 వరకు రాష్ట్రంలో మద్యం సేకరణ ప్రభుత్వం నిర్వహించే పోర్టల్ ద్వారా, మద్యం విక్రయాలు ప్రైవేటు దుకాణాల ద్వారా జరిగేవి. ఎంత మద్యం కావాలో సరఫరాదారులకు కంప్యూటర్ ఆధారిత ఆటోజనరేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లైలు జారీ చేసేవారు. ఐతే 2019 ఆగస్టు 16న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం.357 ఆధారంగా APBCLకు ప్రభుత్వ రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. 2019 సెప్టెంబరు 16న ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్ – IRTS అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి APSBCL ఎండీగా నియమించారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు, డిస్టిలరీలు, లేబుల్ రిజిస్ట్రేషన్లు పూర్తిగా గుప్పిట్లో ఉంచుకోవడానికి ఆయన్నే బెవరేజెస్, డిస్టిలరీస్ కమిషనర్గానూ నియమించారు.
2019 అక్టోబరు 18న APSBCL స్పెషల్ ఆఫీసర్ డి.సత్యప్రసాద్ తిరుపతిలోని నివాసంలో మిథున్ రెడ్డిని కలిసినప్పుడు…ఈ దందాలో తమకు సహకరిస్తే IAS పదోన్నతి ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిథున్రెడ్డి ఆదేశాల మేరకు సత్యప్రసాద్.. APSBCL ద్వారా కొన్నేళ్లుగా జరిగిన మద్యం విక్రయాల వివరాలు సేకరించారు. వాటిని తీసుకొని వాసుదేవరెడ్డితో కలిసి 2019 అక్టోబరు 13న హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ మిథున్రెడ్డి, కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఆయన తోడల్లుడు అవినాష్రెడ్డి కూడా ఉన్నారు. వారంతా కలిసి అమ్మకాల వివరాలను పరిశీలించారు. తమ ప్రణాళిక అమలు చేస్తే ప్రతి నెలా రూ.50-60 కోట్లు దండుకోవచ్చని అంచనా వేశారు.
రిటైల్ దుకాణాలు, డిపోలు, APSBCL ప్రధాన కార్యాలయం, డిస్టిలరీలను అనుసంధానం చేయడానికి 2019 వరకు సీ-టెల్ సాఫ్ట్వేర్ను వాడేవారు. ఆ సాఫ్ట్వేర్ రిటైల్ దుకాణాల్లో విక్రయాలు, స్టాక్, APSBCL డిపోల్లో నిల్వ అన్నీ సరిచూసుకుని ఆటోమేటిక్గా OFSలు జారీ చేసేది. 2019 అక్టోబరు 15న జరిగిన సమావేశంలో పన్నిన కుట్ర ప్రకారం..ఆటోమేటెడ్ OFS జనరేషన్ను డిసేబుల్ చేయమని వాసుదేవరెడ్డి APSBCL CGM ఆంజనేయప్రసాద్కు చెప్పారు. ఆయన ఆదేశాలతో డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ రామకోటేశ్వరరావు ఈ మేరకు సీ-టెల్కు మెయిల్ పంపారు. దాన్ని చూసిన సీ-టెల్ ప్రాజెక్టు మేనేజర్ తూము నాగేంద్ర..ఆటోమేటెడ్ OFS జనరేషన్ను ఆపేస్తే మద్యం సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ APSBCLకు లేఖ రాశారు. మిథున్రెడ్డి, వాసుదేవరెడ్డి వాటిని పట్టించుకోలేదు. రాష్ట్రంలో మద్యం క్రయవిక్రయాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురుద్దేశంతోనే ఆటోమేటిక్ విధానాన్ని తొలగింపజేశారు.
ప్రైవేట్ మెయిల్ ఐడీ సృష్టి –
లిక్కర్ కొనుగోలు ఆర్డర్లు, OFS రిక్వెస్ట్ల కోసం ఓ ప్రైవేట్ మెయిల్ ఐడీ సృష్టించారు. ఈ-మెయిల్కు వచ్చిన ఆర్డర్లను వీరు మాన్యువల్గా పరిశీలించి, ఎంపిక చేసిన డిస్టిలరీలు/ సరఫరాదారులకే మద్యం ఆర్డర్లు ఇచ్చేలా OFSలు జారీ చేసేందుకు మాత్రం సీ-టెల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించారు. ఈ కొత్త విధానం ప్రారంభమైన తర్వాత సొంతంగా మద్యం తయారీ సౌకర్యాలు కూడా లేని కంపెనీలకు APSBCL నుంచి పెద్ద మొత్తంలో OFSలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను పక్కనపెట్టేశారు.
రాష్ట్రంలో ప్రతి నెలా 27-30 లక్షల కేసుల IML, 7-10 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. తొలినాళ్లలో ముడుపుల గురించి సరఫరాదారులతో కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, అవినాష్రెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి..తర్వాత వాసుదేవరెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత అవినాష్రెడ్డి, అనంతరం బూనేటి చాణక్యలు హైదరాబాద్ నుంచే సరఫరాదారులు, డిస్టిలరీలతో సమన్వయం చేశారు. సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్రా గోల్డ్, HD విస్కీలాంటి బ్రాండ్లకు కేసుకు రూ.150, దారూహౌస్, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లెండ్లకు కేసుకు రూ.200, కొన్ని బ్రాండ్లకు కేసుకు రూ.350, హైఎండ్ బ్రాండ్లకు కేసుకు రూ.600 ముడుపుల కింద ఖరారు చేశారు. రెవెన్యూ శాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ్ జారీ చేసిన స్పెషల్ మెమో ఆధారంగా విజయసాయిరెడ్డి సిఫారసు ప్రకారం అనూష అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ను MIS సెక్షన్లో నియమించారు. ఆమె రోజూ మద్యం విక్రయాల డేటా తీసుకొని తన సెల్ఫోన్ నుంచే విజయసాయిరెడ్డికి, సైఫ్ అనే వ్యక్తికి పంపేవారు.
అమ్మకాల డేటా ఆధారంగా ఏ డిస్టిలరీ/సప్లయర్ ఎంత ముడుపులు చెల్లించాలో సైఫ్ లెక్కగట్టి..కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి పంపేవారు. దాన్ని ఆయన అవినాష్రెడ్డి, చాణక్యలకు పంపేవారు. వీళ్లు ఐదురోజులకోసారి తయారీదారులు/సరఫరాదారుల నుంచి కిరణ్కుమార్రెడ్డి, దిలీప్, ఖురేషీ, చిస్తి ద్వారా ముడుపులు నగదుగా వసూలు చేసేవారు. తర్వాత ఆ మొత్తాన్ని కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి అప్పగించేవారు. లంచాలు అందిన తర్వాత దాని ఆధారంగా ఆర్డర్ ఫర్ సప్లై, ఇండెంట్ ప్లాన్ క్రియేట్ చేసి దాన్ని సాయిప్రసాద్ A-3కి అప్పగించేవారు. ఆ ప్రణాళికను డిపో మేనేజర్లు కచ్చితంగా అమలు చేసేలా సత్యప్రసాద్ రోజూ 5, 6సార్లు వారితో వాట్సాప్ కాల్స్ మాట్లాడేవారు. ఇప్పటి వరకు గుర్తించిన దాని ప్రకారం నెలకు సగటున రూ.50-60 కోట్లు వసూలు చేశారు. తద్వారా తమకు లంచాలిచ్చిన కంపెనీలతోపాటు తాము కూడా భారీగా ప్రయోజనం పొందారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు