కడప జిల్లా కోర్టును ఆశ్రయించిన సిబిఐ అధికారులు.
కోర్టు అనుమతితో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లకు నోటీసులు ఇచ్చే అవకాశం.
వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసు తీసుకునేందుకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తిరస్కరించినట్లు తెలిసింది. ఈ కేసులో 207 మందిని విచారించి, 146 మంది వాంగ్మూలాలు రికార్డు చేసిన సీబీఐ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను విచారించేందుకు సిద్ధమైంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయ పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారులతోపాటు మరికొందరు ముఖ్య అధికారులు గురువారం పులివెందులకు చేరుకున్నారు. విచారణకు రావాలని అవినాశ్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు కడప జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కోర్టు అనుమతి తీసుకుని శుక్రవారం మరోసారి నోటీసు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు కడగడం, మృతదేహంపై ఉన్న గాయాలకు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందితో కుట్లు వేయించి కట్లు కట్టించడంలాంటి ఆధారాల ధ్వంసంలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని.. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసిందీ ఆయనే అని పలువురు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆధారాల ధ్వంసం నుంచి వివేకా కుటుంబ సభ్యుల అనుమానాలు, నిందితుల వాంగ్మూలాలు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన అంశాల ఆధారంగా అవినాశ్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది.
Must Read :-వివేకా హత్య కేసుపై భార్య సంచలన వ్యాఖ్యలు!