వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఐతే ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని జగన్ భయపడుతున్నారు. ఆదివారం ఈ రెండు స్థానాల్లో ప్రచారం ముగిసింది. ప్రచార గడువు ముగియగానే జగన్ ఓ ట్వీట్ చేశారు. పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని.. వంద మంది వైసీపీ కార్యకర్తల్ని బైండోవర్ చేశారన్నారు. వైసీపీ నేతలపై అదే పనిగా దాడులు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిపై దాడులు చేశారని ..MLCకి గాయాలయ్యాయన్నారు.
టీడీపీ నేతలపై ఎలాంటి కేసులు పెట్టలేదని, అరెస్టులు చేయలేదని..పోలింగ్ రోజున వైసీపీ నాయకులు , కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారని ముందుగానే ఓటమి రాగం పాడేశారు. వైసీపీ నేతలను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని, తప్పుడు ఫిర్యాదులతో వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చారన్నారు. వైసీపీ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రాకుండా..దూరంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారన్నారు. ఇందుకు సంబంధించి ఓ లిస్టు కూడా జగన్ జత చేశారు.
జగన్ ట్వీట్పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్లో ఓటమి భయం మొదలైందంటున్నారు.ఇన్నాళ్లూ పులివెందులలో రిగ్గింగ్ చేసి గెలిచారంటూ జగన్ను ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు నిజంగా ఓటు వేయబోతుండడంతో జగన్లో వణుకు మొదలైందంటున్నారు టీడీపీ నేతలు. అందుకే ముందుగానే ఓటమికి జగన్ సాకులు వెతుకుతున్నారంటూ మండిపడుతున్నారు. మంగళవారం ఒంటిమిట్ట, పులివెందుల ZPTC స్థానాలకు పోలింగ్ జరగనుంది











