తిరుమలలో కల్తీ నెయ్యి, జంతు కొవ్వులు కలిసిన తంతు బయటికి రాగానే గత ప్రభుత్వంపై ఎన్నిరకాల విమర్శలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఉన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాయాంలోనే నెయ్యి కాంట్రాక్టర్ ను మార్చడం.. కల్తీ నెయ్యి తిరుమలలోకి ప్రవేశించడం వంటివి జరిగాయి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి తక్కవ రేటుకి వస్తుందన్న వాదనతో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ కు ఆ నెయ్యి కాంట్రాక్టు వచ్చేలా చేశారని అంటున్నారు. ఒకవేళ వారు ప్రమాణాలకు తగిన నెయ్యి పంపనప్పటికీ అది తిరుమలకు వచ్చే అవకాశమే లేకుండా ఇక్కడ వ్యవస్థ ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ జారీ చేసినప్పుడు అందులో కొన్ని మార్గదర్శకాలను చాలా క్లియర్ గా పేర్కొంటుంది. ఎంపికైన సంస్థ నెయ్యిని ఆ ప్రమాణాలతో పంపితేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. లేదంటే తిరిగి నెయ్యి ట్యాంకర్ ను వెనక్కి పంపేస్తారు. టెండర్ డాక్యుమెంట్ మార్గదర్శకాల ప్రకారం.. నెయ్యి ట్యాంకర్ రాగానే ఆ నమూనాలను కల్తీ ఉందో లేదో అని తనిఖీ చేయాలి. టీటీడీ ల్యాబ్లో తేమ, ఆర్ఎం వ్యాల్యూ, రాన్సిడిటీ, అయోడిన్ వ్యాల్యూ, ఫ్యాట్ మొదలైన ప్రాథమిక పారామీటర్ల కోసం పరీక్షా సౌకర్యాలు ఉన్నాయి. టెండర్ లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందో లేదో అని తెలుసుకునేందుకు ఈ ల్యాబ్ లో పరీక్ష చేస్తారు. కానీ అంతకుమించిన పరీక్షల సౌకర్యం అందుబాటులో లేనందున కల్తీ కోసం ఎప్పుడూ పరీక్షించలేదు. అయితే, జంతుకొవ్వులు కలిసినప్పుడు టీటీడీ పేర్కొన్న ప్రమాణాల ప్రకారం విలువలు ఉండవు. అలాంటప్పుడు నెయ్యి ట్యాంకర్ ను ఎలా అనుమతించారనే అనుమానాలు కలుగుతున్నాయి. పథకం ప్రకారమే ఈ పాపం చేశారా అనే భావన కూడా వ్యక్తం అవుతోంది.
లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ నుంచి 4 ట్యాంకర్లను ఉపయోగించారు. నాసిరకం లడ్డూల గురించి తరచుగా ఫిర్యాదులు రావడంతో, కొత్త ఈవో శ్యామలరావు నెయ్యి కల్తీ అయ్యే అవకాశంపై చర్య తీసుకున్నారు. గుజరాత్లోని NABL గుర్తింపు పొందిన ల్యాబ్ NDDBకి పరీక్ష కోసం నమూనాలను పంపారు. ఈ టెస్టులో ఎస్ విలువ.. జంతువుల కొవ్వు ఉందని తేల్చింది. అప్పుడు అసలు గుట్టు బయటపడింది. దీంతో గత ప్రభుత్వం హాయాంలో జరిగిన పాపం బయటికి వచ్చింది.
గత వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం తిరుపతి లడ్డూలో నాసిరకం పదార్థాలు, జంతు కొవ్వును ఉపయోగించిందని ఏపీ సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. కేంద్రం కూడా దీనిపై సీరియస్ అయి.. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా నోటీసులు పంపింది. సెప్టెంబర్ 23లోగా సమాధానం ఇవ్వాలని లేనిపక్షంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రెగ్యులేషన్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ ఫుడ్స్ ను హెచ్చరించింది.