(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
‘రాజాధిరాజ.. రాజ మార్తాండ..’ అంటూ రాజరిక వ్యవస్థలో రాజులను అప్పటి కవులు, కళాకారులు పొగిడితే వెనువెంటనే రాజు తన మెడలో ఉన్న ఆభరణాలను తీసి వారికి బహుమానాలుగా ఇచ్చేవారు. చాలా పౌరాణిక సినిమాల్లో ఇటువంటి దృశ్యాలు మనం చూసి ఉంటాం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల నిర్వహించిన ఐదు రోజుల అసెంబ్లీ భేటీలో మంత్రులు, ఆ మాటకొస్తే వైసీపీలోని ప్రతి ఒక్కరూ సీఎంను ఏదో ఒక రూపంలో కొనియాడడానికే తమ సమయం వినియోగించారనేది కళ్లకు కట్టిన వాస్తవం. చివరి రోజు అయితే .. ఈ పొగడ్తలు పరాకాష్టకు చేరాయి. ఏకంగా స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా జగన్ను దేవుడు పంపించిన.. రాక్షసులను (టీడీపీ) అంతం చేయడానికి వచ్చిన దైవ దూతగా.. అభివర్ణించి.. కీర్తించారు. దీంతో సీఎం సభలోనే మురిసిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ పరిణామాల తర్వాత.. సీఎం జగన్ను సీతారాం కలిశారు . ఈ సమయంలోనే తన కుమారుడు నాగ్ను పరిచయం చేయడం.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరడం కూడా వార్తల్లోకి ఎక్కాయి. అయితే.. సీతారాం మనసులో కోరిక తెలిసిన జగన్.. ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని వైసీపీ నాయకులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు ఉన్న సీతారాం.. శ్రీకాకుళం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి నాయకులు, మంత్రులు ఉన్నా.. ఫైర్ బ్రాండ్ నేతలు కరువయ్యారు.
జిల్లాలో సీనియర్గా ధర్మాన ప్రసాదరావు ఉన్నప్పటికీ.. ఆయన సబ్జెక్టు వారీగా మాట్లాడతారే తప్ప.. ఫైర్ బ్రాండ్ కాదు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రి అప్పలరాజులు కూడా దూకుడు రాజకీయాలకు, కామెంట్లకు దూరం. అడపా దడపా తమ ఉనికిని చాటుకునేందుకు వారూ ఈ మధ్య దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ .. సీతారాంకు సరితూగగలిగేవారు కాదన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీ మరింత పుంజుకునేందుకు సీతారాం వంటి వారిని సంతృప్తి పరిస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్ల వచ్చే మంత్రి వర్గ విస్తరణలో ఖచ్చితంగా సీతారాంకు పదవి ఖాయమని స్థానిక వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
Must Read ;- తమ్మినేని కోరిక నెరవేరేనా..?
కల సాకారమయ్యేనా ..?
అసెంబ్లీ స్పీకర్, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాంకు త్వరలోనే ప్రమోషన్ దక్కుతుందని జిల్లా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పటి నుంచో కలలు కంటున్న మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. సీతారాం దూకుడు, స్వామి భక్తి, నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం, ప్రతిపక్షంపై వీలు చిక్కినప్పుడల్లా.. వ్యాఖ్యల దాడి చేయడం వంటివి కలిసి వస్తున్నాయని చెబుతున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ సీతారాం.. ప్రతిపక్షాన్ని వరుసగా సస్పెండ్ చేయడంతోపాటు.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రమోషన్ ఖాయమని వైసీపీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read ;- అధికారులందరూ వస్తే తలుపులు వేద్దాం.. వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం