వైసీపీ నేతలు వారి పంథా మార్చుకోవడం లేదు. హైకోర్టు తీర్పులను తప్పుపట్టి న్యాయమూర్తులపైనే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వివాదం తేలకముందే పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన తాజా వ్యాఖ్యల వీడియో వివాదాస్పదంగా మారింది. ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారా? అసలు మీరు జడ్జిలేనా అంటూ పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు అవినీతికి పాల్పడవచ్చా? మీరు పేద కుటుంబంలో పుట్టలేదా? పేదల కష్టాలు మీకు తెలియవా? చంద్రబాబు ఏ వ్యాఖ్యలు చేస్తే ఆ తీర్పులు ఇస్తారా అంటూ ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే…
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సగ్గువారిపెల్లె గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కొందరు అర్హులకు ఇళ్ల స్థలం కేటాయించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే విధించింది. సురేంద్ర అనే వైసీపీ నాయకుడు అతని కుమారుడు వాలంటీర్ ద్వారా 40 మంది పేదల వద్ద ఒక్కో సెంటు భూమికి రూ.40 వేలు లంచం వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సురేంద్రను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంతో వీడియోలు ఇవాళ లీక్ చేశారని తెలుస్తోంది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. దీనిపై న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.
Also Read: చంద్రబాబు పాలనను కీర్తించిన సోము వీర్రాజు