మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిదే ..
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా నిబంధనలను మాత్రం ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని కండీషన్స్ విధించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. అలాగే ఫీవర్ సర్వేను కొనసాగించాలని వైద్యారోగ్య సిబ్బందిని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇవ్వాలని జగన్ రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి విదితమే. అయితే ఇప్పటి వరకు ఏపీలో నమోదు అయిన కోవిడ్ కేసుల సంఖ్య 23 లక్షల 13వేల 212 కు చేరాయి. అలానే 14 వేల 698 మంది కరోనా సోకి మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 14 వేల 726 యాక్టీవ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 22 లక్షల 83 వేల 788 మంది రికవరీ అయ్యారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖాధికారులు వెల్లడించారు.