ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ ఒప్పందం ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ, ఇప్పుడు రూటు మారుస్తోందా..? ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలు చూస్తుంటే..జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నారనే చర్చ మొదలైంది. ప్రధాని వ్యక్తిగత పర్యటనలు, భద్రతపై విమర్శలు గుప్పించడం వెనుక వైసీపీ అడుగులు కాంగ్రెస్ కూటమి వైపు వేసే సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సాధారణంగా వైసీపీ నేతలు ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి సాహసించరు. కానీ, తాజాగా పేర్ని నాని ప్రధాని సూచనలను ఎద్దేవా చేస్తూ..ప్రజలకు చెప్పేముందు మోదీ గారు రైళ్లలో, కమర్షియల్ విమానాల్లో తిరగాలంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడే ప్రధాని ముందు ఆచరించి చూపాలని నాని అనడం.. బీజేపీతో వైసీపీ తెగతెంపులు చేసుకోబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ పెద్దల అండ కోల్పోయామన్న ఫ్రస్ట్రేషనో లేక కొత్త మిత్రుల కోసం వెతుకులాటో గానీ, వైసీపీ ఎటాక్ ఇప్పుడు నేరుగా మోదీ వైపే మళ్లింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటం, కేంద్రం నుంచి చంద్రబాబుకు పూర్తి మద్దతు లభిస్తుండటంతో జగన్ ఇప్పుడు తన పాత గూడైన కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్తో చేతులు కలపడం ద్వారా బీజేపీని ఢీకొట్టవచ్చని, తద్వారా జాతీయ స్థాయిలో రక్షణ పొందవచ్చని వైసీపీ భావిస్తోంది. పేర్ని నాని వంటి సీనియర్ నేతతో ప్రధానిపై విమర్శలు చేయించడం ద్వారా తాము ఇండి కూటమికి దగ్గరవుతున్నామనే సంకేతాన్ని జగన్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది.











