భారతీయ జనతా పార్టీ ఎంతటి వంచనాశిల్పంతో రాజకీయం నడిపిస్తోందో.. ఇవాళ తేటతెల్లమైంది. ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని- అది అమరావతి’ అనే నినాదంతో.. రైతులు చేస్తున్న ఆందోళనలు 250 రోజులకు చేరుకున్న రోజున.. కమలం నాయకులు ఒక్కరూ సానుభూతి తెలపడానికైనా దరిదాపుల్లో లేకపోవడం వారి అసలు బుద్ధిని బయటపెడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన సమయంలోనే చెంబు నీళ్లు, మట్టి దులపరించుకుని.. మోడీ ఈ నగరం పట్ల తనకు ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో చాటుకున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల పేరుతో కొత్త ఎపిసోడ్ ప్రారంభించినప్పుడు.. భాజపా అమరావతి అనుకూల పాట పాడసాగింది. అదే సమయంలో కేంద్రంలోని భాజపా నాయకులంతా.. రాజధాని అనేది రాష్ట్రం ఇష్టం అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. కేంద్రం అధికారికంగా కోర్టులో అఫిడవిట్ రూపేణా కూడా అదే సంగతి చెప్పింది. రాష్ట్ర నాయకులు ఒక రకంగా, కేంద్ర నాయకులు ఒక రకంగా మాట్లాడడం చిత్రమే.
అయితే అమరావతి రాజధానికే మద్దతు అని చెప్పే కమల నాయకులు ఎవ్వరూ.. అక్కడ కనిపించలేదు. అక్కడి రైతుల దీక్షల మీద సానుభూతి లేదో.. రావడానికి మొహం చెల్లలేదో.. వస్తే రైతులు తమ మాయమాటల పట్ల ఆగ్రహించి భరతం పడతారని భయపడ్డారో కూడా తెలియదు. మొత్తానికి ఎవ్వరూ రాలేదు.
కన్నా ఇక కాడి పక్కన పారేసినట్టే…
కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లాకే చెందిన వ్యక్తి. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించి, ప్రకటించి, భూములు సేకరించి.. ఇప్పుడు తరలించడం ద్వారా జరిగిన వంచన ఎఫెక్ట్ జిల్లా మీదనే కాదు.. యావత్ రాష్ట్రం మీద ఏ స్థాయిలో పడుతుందో.. స్థానిక నేతగా బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ప్రారంభంలో అమరావతికి అనుకూలంగా గట్టిగానే మాట్లాడారు. కానీ.. ఇప్పుడు ఆయనకే పదవి లేదు. పార్టీ అధ్యక్షుడిగా తొలిగించిన తర్వాత.. ఎంత శ్రద్ధగా పార్టీ పట్ల ఉన్నారో తెలియదు. ఎంత పోరాడినా తమ పార్టీ అమరావతి గోడు పట్టించుకోదని ఆయనకు ఫుల్ క్లారిటీ ఉన్నట్టుగా ఉంది. అందుకే ఆయన కూడా కాడి పక్కన పారేశారు. ఎటూ ఇప్పుడు తనకు పదవి కూడా లేదు గనుక.. కనీసం ప్రకటనలు ఇవ్వడానికి కూడా మీడియా ముందుకు రావడం లేదు.
అమరావతి రైతులకు భాజపా మీద ఏమాత్రం ఆశలున్నా.. వాటికి తిలోదకాలు ఇవ్వడం మేలని ఇవాళ్టితో అర్థమైపోతోంది.