విజయవాడకు అనుకోని రీతిలో ముంచెత్తిన వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మందికి ఇల్లంతా వరదతో నిండిపోయి.. ఇంట్లోని ఎలక్ట్రానిక్ సహా సాధారణ ఉపకరణాలు అన్నీ పాడైపోయాయి. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారు చాలా నష్టపోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు చంద్రబాబు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇంకా వివిధ రంగాల వారిని ఆదుకుంటామని మంగళవారం ప్రెస్ మీట్ చెప్పి వివరించారు. దీంతో విజయవాడ బాధితులు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి వరద తాకిడికి గురైన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం.. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారికి రూ.10 వేలు, చిరు వ్యాపారులకు రూ.25 వేల చొప్పున పరిహారం చంద్రబాబు ప్రకటించారు. బైక్స్ దెబ్బతింటే 3 వేలు, ఆటోలు పాడైతే రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. పైగా బైక్ల ఇన్సూరెన్స్, రిపేర్లకు సంబంధించి ఇప్పటికే 9 వేలకు పైగా క్లెయిమ్లు పరిష్కరించినట్లు చంద్రబాబు తెలిపారు. మరో 6 వేల క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
నష్టపోయిన సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల్లో రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వాటికి రూ.లక్ష.. రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.1.5 లక్షలు ఇవ్వనున్నారు. కోళ్ల విషయంలో ఒక్కో కోడికి రూ.100.. కోళ్ల ఫారం డ్యామేజీ అయితే రూ.5 వేలు.. ఎద్దులకు రూ.40 వేలు.. దూడలకు రూ.25 వేలు.. గొర్రెలకు రూ.7,500.. ఎడ్ల బండి కోల్పోతే వారికి కొత్తవి అందజేస్తామని చంద్రబాబు చెప్పారు.
పంట నష్టపోయిన వారిలో ఒక హెక్టారు (2.47 ఎకరాలు) పత్తికి రూ.25 వేలు, వేరు శనగకు రూ.15 వేలు, హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్కు కూడా రూ.15 వేలు.. పసుపు, అరటికి రూ.35 వేలు.. మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారుల విషయంలో ఫిషింగ్ బోట్, వల పాక్షికంగా దెబ్బ తింటే రూ.9 వేలు, పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు ఇస్తామని సీఎం వివరించారు. సెరీ కల్చర్కు రూ.6 వేలు. గేదెలకు రూ.50 వేలు. వరి ఎకరాకు రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు జగన్ హాయాంలో ఏ విపత్తు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సాయాన్ని ఇంత సవివరంగా ప్రకటించని సంగతి తెలిసిందే.