ఒక్కసారి అవకాశం ఇస్తే అవినీతికి తావులేని పాలన అందిస్తానంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. అధికారంలోకి అయితే వచ్చారు కానీ వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు మాత్రం మారడం లేదు. ప్రపంచంలో జగనన్న మాదిరి ఎవరూ అవినీతి పాలన అందించలేరని వారం క్రితం ఓ ఎమ్మెల్యే పార్టీ పరువు తీశారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సీఎం జగన్ ప్రజలను దోచుకుంటున్నాడంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో నోరు జారారు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు.
ప్రజలు, ప్రతి పక్షాలకు కుక్కలతో పోలిక
ప్రజలు, ప్రతిపక్షాలను కుక్కలతో పోల్చి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరో వివాదానికి తెర లేపారు. ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రతిపక్షాలు కుక్కల్లా మొరుగుతున్నాయని, ప్రజలు మాత్రం కుక్కల్లా మొరగకుండా విశ్వాసంగా ఉన్నారని డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తిట్టడంలో విశేషం లేకపోయినా, ఈ సారి ఏకంగా ప్రజలను కుక్కలతో పోల్చడంపై రచ్చ రాజుకుంది. డిప్యూటీ సీఎం మరో జలక్ కూడా ఇచ్చారు. గుడ్ ఫ్రై డే ముస్లింల పండుగ అంటూ కొత్త భాష్యం చెప్పి నారాయణ స్వామి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై వైసీపీ పెద్దలు ఇంకా స్పందించలేదు. ఎలాగూ నా మంత్రి పదవి పోతుందని డిప్యూటీ సీఎం నిన్ననే వ్యాఖ్యానించారు. అయితే తిరుపతిలో నోరు జారారా, లేదంటే మనుసులో మాట తన్నుకు వచ్చిందా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.