ధరణి పోర్టల్కి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి హైకోర్టు తాజాగా సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ వివరాలు సేకరించకూడదని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ అనే కాలమ్ని తొలగించే వరకు స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
ఆధార్ వివరాలతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలు, కులం వివరాలు వంటివి కూడా అడగకూడదని కోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తుల వివరాలకు సంబంధించిన పత్రాలు ఏవైనా అడగవచ్చని, కానీ ఆధార్, కులం వంటి వ్యవహారాలు అడగడం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని చెప్పింది.
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రజలకు సంబంధించిన సున్నితమైన వివరాలు సేకరించడం కోర్టు సహించబోదని తెలియజేసింది. ప్రజల సమాచారంకు సంబంధించిన భద్రత గురించే కోర్టు ఆందోళన చెందుతుందని చెప్పుకొచ్చింది. ప్రభుత్వం, ప్రజల సమాచార భద్రత గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, కాబట్టి రిజిస్ట్రేషన్ సాఫ్టవేర్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 20న చేపట్టనున్నట్లు చెప్పింది. ఈ లోగా ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా కోర్టు ఆదేశాలను అమలుచేయాలని చెప్పింది.